రామకుప్పం(కుప్పం) : రామకుప్పం మండ లం పరిధిలోని ననియాల తాండా, ఆరిమానుపెంట, పెద్దూ రు అటవీ సరిహద్దులోని పంట పొలాలపై బుధవారం రాత్రి ఒంటరి ఏనుగు దాడి చేసింది. తమిళనాడు నుంచి వచ్చిన ఒంటరి ఏనుగు వారం రోజులుగా పొలాల్లో తిరుగుతూ పంటలను ధ్వంసం చేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగు బారి నుంచి పంటలను కాపాడాలని, దెబ్బతిన్న పంటలకు పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.
ఇద్దరికి తీవ్ర గాయాలు
పుత్తూరు: స్థానిక బైపాస్ రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. పుత్తూరు మున్సిపాలిటీలోని 2వ వార్డు కేఎం అగ్రహారం గ్రామానికి చెందిన రంజిత్(23), రోహిత్(22) బైక్లో పుత్తూరుకు వస్తుండగా తిరుపతి నుంచి నగరి వైపు వెళ్తున్న వ్యాన్ ఢీకొంది. దీంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. బైక్ నుజ్జునుజ్జు అయింది. యువకులను స్థానికులు 108లో తిరుపతి రుయాకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
యువతి అదృశ్యం
పుత్తూరు: పట్టణంలోని ఎన్జీవో కాలనీకి చెందిన ఏళ్ల యువతి (19) గురువారం కళాశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె స్థానిక ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ తొలి ఏడాది చదువుతోంది. నెల రోజుల క్రితం ఒక కుటుంబం పెళ్లి చూపులకు పుత్తూరుకు వచ్చి వెళ్లింది. సదరు అబ్బాయే తమ అమ్మాయిని తీసుకెళ్లి ఉండవచ్చునని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


