ప్రమాదానికి కారణం సెల్ఫ్ డ్రైవింగ్ చేయడమే
నిద్రమత్తులోనే కారు డ్రైవర్
తన లారీని ఢీకొన్నాడన్న డ్రైవర్
తిరుమల శ్రీవారిని దర్శించుకుని సంతోషంగా ఇంటికి బయలుదేరిన ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. పలమనేరు సమీపంలోని మొగిలి ఘాట్లో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బొలేరో కారు ఢీకొంది. దీంతో అక్కడికక్కడే ఒకరు, పలమనేరు ఆస్పత్రిలో మరొకరు మృతిచెందారు. అదే కారులోని తల్లి, బిడ్డ ప్రాణాలతో బయటపట్టారు. తమను ఏడు కొండల వాడే కాపాడాడని వారు తెలిపారు.
పలమనేరు: తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరి జిల్లా వేపనపల్లికి చెందిన పాండియన్(64), కుమారుడు ఉమాపతిరాజా(33), అతని భార్య నిత్య(26), కుమార్తె పోమిత(3), గణపతి(44), అతని భార్య కాంచన(38) బుధవారం కారులో తిరుమల వెళ్లారు. గురువారం ఉదయం స్వామిని దర్శించుకుని తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. పాండ్యన్ వాహనాన్ని నడుపుతున్నారు. పలమనేరు సమీపంలోని మొగిలిఘాట్లో వెళుతున్న సమయంలో రెండు రోజులుగా నిద్రలేని పాండ్యన్ నిద్రలోకి జారుకున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా ఉన్న లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కాంచన అక్కడికక్కడే మృతిచెందింది. ఉమాపతిరాజు(33) తీవ్రంగా గాయపడి పలమనేరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
కుడివైపున్నవారు సురక్షితం
కారులో కుడివైపు ఉన్న డ్రైవర్ పాండ్యన్, అతని వెనుక సీట్లో ఉన్న గణపతి, నిత్య, ఈమె కుమార్తె పోమిత గాయాల బారిన పడి ప్రాణాలతో బయటపడ్డారు. ఎడమవైపున ఉన్న కాంచన, ఉమాపతిరాజు మృతిచెందారు.
ప్రమాదానికి కారణం నిద్రమత్తే..
ఇటీవల సంభవిస్తున్న రోడ్డు ప్రమాదాల్లో సెల్ఫ్ డ్రైవర్లే ఎక్కువగా కారణమవుతున్నారు. వీరు డ్రైవర్లను పెట్టుకోకుండా సొంతంగా డ్రైవ్ చేస్తూ ఇలాంటి ఘటనలకు కారణమవుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలోనూ కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం చేసుకుని విశ్రాంతి లేకుండా తిరుగు ప్రయాణం చేయడంతో నిద్ర మత్తులోకి జారుకుని ఆగి ఉన్న లారీని ఢీకొట్టినట్టు లారీ డ్రైవర్ పేర్కొంటున్నారు.
రోడ్డు ప్రమాదంలో
సురక్షితంగా బయటపడిన తలి, బిడ్డ


