పైలెట్ ప్రాజెక్ట్గా కాణిపాకం, ఎం.పైపల్లి, తూగుండ్రం పాఠశాలల్లో అమలు విజ్ఞాన శాస్త్రం, ఇంజినీరింగ్ ప్రయోగాలపై విద్యార్థులకు శిక్షణ ఇందుకు రూ.13 లక్షలు కేటాయించిన ప్రభుత్వం రూ.10 లక్షల నిధులతో సైన్స్ సెంటర్ అభివృద్ధికి ప్రతిపాదనలు
చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో విజ్ఞాన, సాంకేతిక ఆలోచనలను పెంపొందించేందుకు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. యూత్ ఫర్ సేవా ఎన్జీవో జిల్లా కో ఆర్డినేటర్ హరీష్ ఆధ్వర్యంలో జిల్లాలోని ఐరాల మండలం కాణిపాకం, ఎం.పైపల్లి, గంగాధరనెల్లూరు మండలం తూగుండ్రం జెడ్పీ హైస్కూళ్లను పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. వీటిలో ప్రత్యేకంగా స్టెమ్ ల్యాబ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్)లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం రూ.13 లక్షలు కేటాయించారు. ఈ మేరకు డీఈవో లక్ష్మీనారాయణ చర్యలు తీసుకుంటున్నారు.
ఆధునిక సాంకేతికత, సమగ్ర పర్యవేక్షణ
ల్యాబ్లలో సైన్స్, ఇంజినీరింగ్ ప్రయోగాలపై విద్యార్థులకు ప్రత్యక్ష అనుభూతిని కల్పించేలా అధునాతన టెక్నాలజీ సహాయంతో బోధన చేస్తారు. విద్యార్థుల ప్రతిభను అంచనా వేసేందుకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే ల్యాబ్ కార్యకలాపాలు, ఆన్లైన్ పరీక్షల నిర్వహణను ట్రాక్ చేసేందుకు ప్రత్యేక వెబ్సైట్ను అందుబాటులోకి తెస్తున్నారు. దీనిద్వారా విద్యార్థుల ప్రతిభ, ల్యాబ్ వినియోగంపై నెలానెలా పురోగతి నివేదికలను పర్యవేక్షిస్తారు. ఈ ల్యాబ్లను సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా సంబంధిత ఉపాధ్యాయులకు ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రముఖ కార్పొరేట్ కంపెనీల సామాజిక బాధ్యత నిధులు రూ.10 లక్షలతో జిల్లా కేంద్రంలోని సైన్స్ సెంటర్ అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.


