చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలో గణేష్ నిమజ్జనోత్సవ వేడుకలు బుధవారం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని వివిధ మండపాల నుంచి స్వామివారి విగ్రహాలను శోభాయాత్రగా తరలించారు. ఊరేగింపులో యువత, భక్తులు డప్పు వాయిద్యాల దరువులకు నృత్యాలు చేశారు. రంగుల కేరింతలు, బాణసంచా పేలుళ్లు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనల మధ్య శోభాయాత్ర కోలాహలంగా సాగింది. ఊరేగింపు అనంతరం విగ్రహాలను కట్టమంచి చెరువు వద్దకు తరలించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో వినాయకుడికి చివరి పూజలు చేసి జలధివాసం గావించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
క్రేన్ సాయంతో వినాయకుడిని
నిమజ్జనం చేస్తున్న భక్తులు


