గుడిపాల: కొంతమంది ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. ఈ విషయం తెలిసినా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. మండలంలోని వసంతాపురం పంచాయతీ పశుమంద రెవిన్యూలోని సర్వే నంబర్ 40/1లో 24.03 ఎకరాల్లో కొత్తచెరువు ఉంది. అలాగే సర్వే నంబర్లు 42/3, 38లో 1.82 ఎకరాల కాలువ పోరంబోకు ఉంది. ఈ చెరువుకు సంబంధించి అటవీప్రాంతం నుంచి వంకల ద్వారా చెరువులోకి నీరు వచ్చేది. వంకల పక్కన గ్రానైట్ క్వారీలు ఉండడంతో గ్రానైట్కు సంబంధించిన వ్యర్థాలను వంకల్లో వేసి పూడ్చివేశారు. చెరువుకు సంబంధించిన భూమిని కూడా గ్రానైట్ వ్యర్థాలు వేశారు. కొంతమంది చెరువు భూమిని దున్నుకుని పంటలు సాగు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొత్తచెరువులో ఉన్న 24 ఎకరాల భూమిలో ఐదు ఎకరాల భూమి వరకు కబ్జా అయ్యింది. మిగిలిన భూమిని కుడా కబ్జా చేసేందుకు కొంతమంది పన్నాగం పన్నుతున్నారు. ఈ చెరువుకు రావాల్సిన వంకలన్నీ పూడిపోవడంతో వర్షాలు అధికంగా వస్తే వ్యవసాయ పొలాలవైపు నీరు పోవాల్సి ఉందన్నారు. రెవెన్యూ అధికారులు కబ్జాలకు గురైన భూమిని సర్వే చేయించడంతో పాటు పూడ్చివేసిన వంకలను సర్వేచేసి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.


