● జిల్లాలో 113 వైన్షాపులకు గడువు ఏడాది పొడిగింపు ● రూ.23 లక్షలు.. రూ.27.20 లక్షల ఫీజు ● 21తేదీ లోపు రెన్యూవల్ చేసుకోకుంటేనే దరఖాస్తులు ● టెండర్లు.. లక్కీడిప్ లేకుండానే లైసెన్సులు
ప్రజా సంక్షేమం పట్టదు కానీ, తమ్ముళ్ల జేబు నింపడంలో మాత్రం చంద్రబాబు ప్రభుత్వానికి పెద్ద మనసు వచ్చేస్తుంది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా లిక్కర్ మాఫియా పచ్చమూక కనుసన్నల్లోనే సాగుతోంది. మళ్లీ టెండర్లు పిలవడం ఎందుకని భావించిన సర్కారు మళ్లీ తమ నేతలకే కిక్కు ఇచ్చేందుకు కార్యాచరణ అమలు చేసింది. అందులో భాగంగా మద్యం దుకాణాల లైసెన్సులను మరో ఏడాది పొడిగిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తులతో పని లేకుండా.. లక్కీడిప్కు అవకాశమివ్వకుండా రెన్యూవల్ పేరుతో దోపిడీకి దారులు తెరిచేసింది.
సాక్షి, చిత్తూరు: అంతా అనుకున్నట్టే అయ్యింది. దర ఖాస్తు చేయకుండా, లక్కీడిప్ వేయకుండా.. మద్యం లైసెన్సులను ఉన్నవాళ్లకే రెన్యూవల్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 113 మద్యం దుకాణాల లైసెన్సులను ఏడాది పొడిగిస్తూ జిల్లా ఆబ్కారీ మద్య నియంత్రణ శాఖ అధికారులు శనివారం నోటి ఫికేషన్ విడుదల చేశారు. ఇక ఒకటో తేదీ నుంచి అందినకాడికి అమ్ముకోవడం, దాచుకోవడమే తరువాయి.
నోటిఫికేషన్ విడుదల
ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ టి.విజయశేఖర్, జిల్లా ప్రొహిబిషన్ అధికారి బి.శ్రీనివాస్, ఏఈఎస్ బి.సుందర రామయ్య కలిసి మద్యం దుకాణాల రెన్యూవల్ నోటిఫికేషన్ను శనివారం చిత్తూరులోని అర్బన్ ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్లో విడుదల చేశారు. డీసీ మాట్లాడుతూ జిల్లాలోని 113 మద్యం దుకాణాల లైసెన్సులను అక్టోబర్ 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది సెప్టెంబరు 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం 50వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్సు రెన్యూవల్ రుసుమును రూ.23 లక్షలు, కల్లుగీత కార్మికుల సామాజిక వర్గాలకు రూ.11.50 లక్షలు, పర్మిట్ గదులకు రూ.5 లక్షల ఫీజు ఉంటుందన్నారు. 50 వేల కంటే ఎక్కువ జనాభా ప్రాంతాల్లో జనరల్ కేటగిరీలో రూ.27.20 లక్షలు, పర్మిట్ గదుల ఫీజు రూ.7.50 లక్షలు, కల్లుగీత లైసెన్సుల్లో రూ.13.60 లక్షలు చెల్లించాలని స్పష్టం చేశారు. ప్రతి దుకాణ నిర్వాహకుడు ఈనెల 21వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ఆన్లైన్లో లైసెన్సు రెన్యూవల్ చేసుకోవాలని, ఎవరైనా చేసుకోని పక్షంలో ఆ దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తామన్నారు., రూ.3 లక్షల నాన్ రీఫండబుల్ ఫీజు చెల్లిస్తే, లక్కీడిప్ నిర్వహించి షాపులు కేటాయిస్తామని వివరించారు.
విమర్శలను వస్తున్నా..
జిల్లాలో 2024 అక్టోబర్లో నిర్వహించిన మద్యం దు కాణాల లైసెన్సుల ప్రక్రియలో నాన్ రీఫండబుల్ దర ఖాస్తు రుసుము కింద మాత్రమే ప్రభుత్వానికి రూ.45 కోట్లకు పైగా ఆదాయం లభించింది. ఇక నెలకు మ ద్యం విక్రయాల దాదాపు రూ.70 కోట్లు, లైసెన్సు ఫీజుల ద్వారా దాదాపు రూ.133 కోట్లు ఆదాయం వచ్చింది. పర్మిట్ గదుల పేరిట రూ.3 కోట్లు అదనపు ఆదాయం. కానీ, ఇప్పుడు మాత్రం దరఖాస్తులే చేసుకోకుండా, లక్కీడిప్ వేయకుండా ఏకపక్షంగా దుకాణాలను పాత లైసెన్సులున్న వారికే కట్టబెట్టడానికి నిర్ణ యం తీసేసుకున్నారు. జిల్లాలో 90 శాతం దుకాణాల న్నీ టీడీపీ నేతల చేతుల్లోనే ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం. సొంత పార్టీ నేతలకు ఉపాధి కల్పించేందుకే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నా, పట్టించుకునే పరిస్థితుల్లో లేదు.


