కుప్పం: చిత్తూరు ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త భరత్పై కుప్పం పోలీస్ స్టేషన్లో బుధవారం కేసు నమోదు చేశారు. కుప్పంలోని ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమావేశంలో ఎమ్మెల్సీ భరత్ ప్రసంగంలో అభ్యంతకరమైనా వాఖ్యలు, కుప్పం ప్రజలను భయపెట్టే విధంగా ఉన్నాయని టీడీపీ పట్టణ అధ్యక్షుడు తంబిగానిపల్లి వెంకటేష్ ఫిర్యాదు మేరకు కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ చట్టం ప్రకారం 192,353(1)(బి), 351(2) సెక్షన్ల కింద ఆయనపై కుప్పం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
జాతీయ పోషణ
మాసోత్సవాలు ప్రారంభం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో బుధవారం నుంచి అక్టోబర్ 8 వరకు జాతీయ పోషణ మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్టు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ తెలిపారు. ఆయన పోస్టర్ ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో తల్లి, శిశు సంరక్షణ, చిన్నారుల ఎదుగుదల, పోషకాహార లోపం నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమాల సమర్థవంతమైన నిర్వహణకు ఈ నెల 10వ తేదీన వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఐసీడీఎస్ పీడీ శ్యామసుగుణ, జిల్లా మిషన్ కోఆర్డినేటర్ నిర్మల, పోషణ్ అభియాన్ సిబ్బంది పాల్గొన్నారు.
లారీ ఢీకొని వ్యక్తి మృతి
శాంతిపురం: కుప్పం–పలమనేరు జాతీయ రహదారిలో నాయనపల్లి వద్ద బుధవారం బైకును లారీ ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. మఠం పంచాయతీలోని కేపి మిట్ట గ్రామానికి చెందిన రహమాన్(35) బుధవారం సాయంత్రం రాజుపేట రోడ్డు నుంచి బైక్లో స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో నాయనపల్లి వద్ద కుప్పం వైపు నుంచి వచ్చిన లారీ బైక్ను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన రహమాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రాళ్లబూదుగూరు పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన లారీని పోలీస్ స్టేషన్కు తరలించారు.
గుర్తుతెలియని వ్యక్తి మృతి
చిత్తూరు కార్పొరేషన్: గుడిపాల మండలం బొమ్మసముద్రం రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలులో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు జారిపడి మంగళవారం మృతిచెందాడు. రైల్వే ఎస్ఐ నరసింహులు బుధవారం విలేకరులతో మాట్లాడుతూ గుర్తుతెలియని వ్యక్తి రైలులో ప్రయాణిస్తూ కాలు జారి దూరంగా పడి మరణించాడన్నారు. ఈ విషయాన్ని ఎవరూ గుర్తించలేదని పేర్కొన్నారు. తదుపరి దుర్గంధం వస్తుండడంతో గ్యాంగ్మెన్ ద్వారా సమాచారం తెలిసిందన్నారు. ఈ మేరకు సీఐ యత్రీంద సమక్షంలో క్లూస్ టీమ్తో కలిసి సంఘటన స్థలం వద్దకు వెళ్లి పరిశీలించామన్నారు. ప్రమాదవశాత్తు జారిపడి మరణించినట్లు నిర్ధారణకు వచ్చామన్నారు. మృతుడు బూడిద రంగు నెక్ టీషర్ట్, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. వివరాలు తెలిసిన వారు 9247575619 నంబరులో సంప్రదించాలన్నారు.
లారీని ఢీకొన్న బస్సు – తప్పిన ప్రమాదం
వడమాలపేట (పుత్తూరు): వడమాలపేట రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద బుధవారం ఆర్టీసీ బస్సు, సిమెంట్ మిక్సర్ లారీ ఢీకొన్నాయి. తిరుపతి నుంచి వడమాలపేటకు వస్తున్న లారీని పుత్తూరు నుంచి తిరుపతికి వెళ్తున్న బస్సు ఢీకొంది. లారీ డ్రైవర్ అప్రమత్తంగా లారీని మరోవైపునకు తిప్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అమెండోరాయ్, బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఒకరైన మహేష్ అనే వ్యక్తికి మాత్రం గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. ఎస్ఐ హరీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


