ఫిబ్రవరి 7న పిల్లలతో కలిసి భార్య ఆత్మహత్య మనోవేదనకు గురైన భర్త ప్రేమించి పెళ్లి చేసుకుని.. ఆత్మహత్యలతో అంతమైన కుటుంబం
పుత్తూరు: భార్య, పిల్లలు మృతి చెందడంతో మనోవేదనకు గురైన పుత్తూరు మండలం పైడిపల్లికి చెందిన శివశంకర్ తడుకు ఆర్ఎస్ వద్ద గల ఫారెస్ట్ చెక్పోస్టు సమీపంలోని మామిడి తోటలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ నెట్టి కంఠయ్య తెలిపారు. ఆయన బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. పుత్తూరు మండలం నేసనూరు గ్రామానికి చెందిన పద్మజ(27), పైడిపల్లికి చెందిన శివశంకర్ను ప్రేమించి ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. పుత్తూరు కృష్ణానగర్లో కాపురం ఉండేవారు. వారికి పిల్లలు తేజశ్రీ(7), లాస్య(4) ఉన్నారు. శివశంకర్ ఉద్యోగం చేయకుండా, అప్పులు చేస్తూ జులాయిగా తిరిగేవాడు. ఇంటికి వచ్చి భార్యను వేధించేవాడు. మరోపక్క అప్పుల వారి వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో పద్మజ గత ఫిబ్రవరి 7వ తేదీన ఇంట్లో ఇద్దరు పిల్లలకు ఉరివేసి తానూ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శివశంకర్ వేధింపులతోనే భార్య, పిల్లలు మృతి చెందారని అతనిపైనా, అతని తల్లిపైనా ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో రిమాండ్లో ఉన్న తల్లీకొడుకులు బెయిల్పై బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో శివశంకర్ బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు అతను బంధువులకు ఫోన్ చేశాడు. ‘‘నా భార్య, పిల్లలు చనిపోయారు. వారు లేక నేను జీవించలేను. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను’’ అని తెలిపాడు. తాను చనిపోతున్నట్లు తెలిపే వాయిస్ రికార్డును సైతం బంధువులకు పంపించాడు. భార్య, పిల్లలు లేకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన శివశంకర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


