తిరుపతి మంగళం : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేస్తామని జిల్లా రవాణాశాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్ హెచ్చరించారు. ఆయన బుధవారం రవాణా, పోలీస్ శాఖల అధికారులతో తిరుమల ఘాట్ రోడ్డులో తనిఖీలు చేశారు. ఆయన మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తారని తెలిపారు. వారిని సురక్షితంగా గమ్యాలకు చేర్చే బాధ్యత ట్యాక్సీ వాహనదారులపై ఉందన్నారు. ఘాట్రోడ్డులో వెళ్లే వాహనాలు సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే వాహనాలను తిరుమలకు వెళ్లకుండా నిషేధిస్తామని హెచ్చరించారు. ఎంవీఐ, వెంకటరమణ నాయక్, ఎ ఎంవీఐ ప్రసాద్ వర్మ, ట్రాఫిక్ ఎస్ఐ , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


