చిత్తూరు కార్పొరేషన్ : నగరంలోని చెన్నమ్మగుడిపల్లె వద్ద చిరుతపులి సంచారంపై అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందింది. గత మూడు రోజులుగా ఇటువైపుగా చిరుత సంచరిస్తోందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం కుక్కని చంపిందని వెల్లడిస్తున్నారు. . క్షేత్రస్థాయిలో పర్యటించిన ఎఫ్ఆర్ఓ థామస్ అనుమానిత ప్రాంతాల్లో ట్రాక్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే డ్రోన్ కెమెరా ద్వారా పరిసర ప్రాంతాలను పరిశీలించారు. గ్రామీణులు ఒంటరిగా సంచరించరాదని, రాత్రివేళ బయటకు రావద్దని సూచించారు. చిరుత పాదముద్రలను సేకరించి పరిశీలనకు పంపారు.
ఎగువమాసాపల్లెలో..
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మండలంలోని ఎగువమాసాపల్లెలో రెండు చిరుతలు సోమ వారం రాత్రి ప్రజలను హడలెత్తించాయి. చెన్నమ్మగుడిపల్లె వద్ద ఉదయం దర్శనమిచ్చిన చిరుతలు..రాత్రికి ఎగువమాసాపల్లెలో హల్చల్ చేశాయి. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రోడ్డుపై వెళుతుండగా చిరుతలు ప్రత్యక్షం కావడంతో భయపడి పరుగులు పెట్టాడు. వెంటనే పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు.


