ఉపాధ్యాయులకు ఇచ్చిన
హామీలను వెంటనే నెరవేర్చాలి
అర్హత లేని వారికి ప్రభుత్వ ఉద్యోగాలు
వెన్నుపోటు పార్టీని కూలదోయండి
ప్రభుత్వ ఉద్యోగుల ఉన్నతికి కృషిచేసిన వైఎస్సార్సీపి
శ్రీరంగరాజపురం : ఇటీవల కూటమి ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ నియామకాల్లో సీబీఐ దర్యాప్తు చేయాలని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి డిమాండ్ చేశారు. మండలంలోని పిళ్లారికుప్పంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత మంత్రి నారా లోకేష్ యువగళంలో పాల్గొన్న వారికి అడ్డదారిలో ప్రభుత్వ ఉద్యోగులుగా ఇచ్చారని ఆరోపించారు. కర్నూలు జిల్లా డీఎస్సీలో అక్రమాలు జరిగాయన్నారు. టెట్ పాస్ కాని ప్రభాకర్కు ఉపాధ్యాయ ఉద్యోగం ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. స్పోర్ట్స్ కోటాలో ఐదుగురు ఒక్క వల్లూరు పాఠశాలలోనే రిక్రూట్ అయ్యారని చెప్పారు. ఆ ఐదుగురిని డీఈవో ఆఫీసుకు పిలిచి ఉద్యోగం ఇచ్చారని అన్నారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే 24 మందికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చారనీ, ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీపార్సు చేసిన వారికి ఎలాంటి అర్హత లేకపోయినా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వడం దేశ చరిత్రలో ఎన్నడూ జరగలేదని ఆరోపించారు. తల్లిదండ్రులు తర్వాత స్థానం ఉపాధ్యాయులు ఇస్తారని, అలాంటి పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని పప్పులూ, బెల్లం పంచినట్టు ఇవ్వడం దారుణం అని అన్నారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన వారి రికార్డులను సీబీఐ ద్వారా పరిశీలించాలన్నారు. జగనన్న ప్రభుత్వంలో నియమించిన ప్రభుత్వ ఉద్యోగాలపైన, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ నియమాకాల్లో జరిగిన అవినీతిపైనా సీబీఐ విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. టెట్ అర్హత సాధిస్తేనే ఉపాధ్యాయ వృత్తికి అర్హులని సుప్రీంకోర్టు తెలిపిందని అన్నారు. కానీ కూటమి ప్రభుత్వంలో టెట్ అర్హత లేని వారికి కూడా ఉపాధ్యాయ ఉద్యోగం ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు మోసపూరిత హామీలు ఇచ్చి వారి సహకారంతో అధికారంలోకి వచ్చాక వారిని మోసం చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలను, ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసిన కూటమి పార్టీలకు రాజకీయ సమాధి చేయాలని అన్నారు.


