● పేదల కోసం రూపొందించిన జీఓ దుర్వినియోగం ● తిరుపతి తహసీల్దార్ కార్యాలయంలో విశ్రాంత ఉద్యోగి పెత్తనం ● టీడీపీ నేతలకు దాసోహమైన అధికారయంత్రాంగం
ఖాళీ భూమి కనిపిస్తే కబళించేస్తున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి కబ్జాలకు పాల్పడుతున్నారు. అధికారుల అండదండలతో రికార్డులను తారుమారు చేసేస్తున్నారు. మామూళ్లు ముట్టజెప్పి బోగస్ ఎంట్రీలు చేయించేస్తున్నారు. అనంతరం తాపీగా రిజిస్ట్రేషన్ తతంగం సైతం ముగించేస్తున్నారు. అక్రమార్కుల కారణంగా భూ యజమానులు కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసిన స్థలాలను కొట్టేస్తుంటే లబోదిబోమంటున్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మొత్తం దందాలను టీడీపీ నేతలే వెనకుండి నడిపిస్తున్నట్లు పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. అధికారులను గుప్పిట్లో పెట్టుకుని వ్యవహారాలు సాగిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. అలాగే కొందరు విశ్రాంత ఉద్యోగులు కూడా కీలకపాత్ర పోషిస్తున్నట్లు స్పష్టం చేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, తిరుపతి : ప్రజలకు అత్యంత కీలకమైన రెవిన్యూ శాఖలో అధికార పార్టీ దొంగలు పడ్డారు. ఇదే అదునుగా డబ్బు సంపాదనే లక్ష్యంగా పనిచేసే అనేక మంది రెవెన్యూ ఉద్యోగులు.. రికార్డులను తారుమారు చేసి, బోగస్ ఎంట్రీలు చేసి జేబులు నింపుకుంటున్నారు. దీంతో రూ.లక్షల ఇచ్చి పట్టాలు పొందిన వ్యక్తి కొన్నాళ్లకు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. మరో వైపు అధికారుల అత్యాశతో మోసపోయి భూమి, స్థలాలు పొగొట్టుకున్న వారు లబోదిబో మంటున్నారు. ఇటీవల ఓ ముఠా నకిలీ ఆధార్లు సృష్టించి డబ్బులు కొట్టేసిన ఘటనే ఇందుకు నిదర్శనం. తిరుచానూరు పోలీస్టేషన్ పరిధిలోని చెన్నాయిగుంట శేషాచలం హిల్ వ్యూ లే అవుట్ హెచ్ఐజీ ఫేజ్ 1లోని ప్లాట్ నంబర్ 14, 18 రూ.కోట్ల విలువైన స్థలాలను ఆకాష్ ముఠా ఆధార్ కార్డుల్లో ఫొటోలు, చిరునామా మార్చి రిజిస్ట్రేషన్లు చేసిన బాగోతం బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ఇందుకు కారకులైన పది మందిని తిరుచానూరు పోలీసులు అరెస్టు చేశారు. అయితే వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడానికి అధికార పార్టీ నేతల పైరవీలే కారణం అనే ఆరోపణులు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి రిజిస్ట్రేషన్లు దాదాపు పది జరిగినట్లు సమాచారం.
డైలీ రిజిస్టర్లోనూ..
అర్హులకు మాన్యువల్ సర్టిఫికెట్ ఇస్తే.. ఆ వివరాలను రెవెన్యూ అధికారులు డైలీ రిజిస్టర్లో నమోదు చేయాలి. అందులో ఎంజాయ్ మెంట్ సర్టిఫికెట్ ఒకటి. ఈ అవకాశాన్ని కొందరు రెవెన్యూ అధికారులు యథేచ్ఛగా వినియోగించుకుంటూ రూ.లక్షలు పోగేసుకుంటున్నారు. తిరుపతి అర్బన్, రూరల్, చంద్రగిరి, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, రేణిగుంట, ఏర్పేడు, వెంకటగిరి, నాయుడుపేట, ఎస్ఆర్ పురం, గంగాధరనెల్లూరు, పూతలపట్టు, బంగారుపాళెం పరిధిలో ఈ తరహా ఎంట్రీలు అధికంగా జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బోగస్ ఎంట్రీల కోసం కొందరు రెవెన్యూ అధికారులు రికార్డుల్లోని కొన్ని పేపర్లను చించి వేసిన ఘటనలు ఉన్నాయి. అసలైన పేపర్ని చించి వేసి బోగస్ ఎంట్రీలతో మరో పేపర్ను సిద్ధం చేసి రికార్డుల్లో చేర్చేస్తున్నారు.
జీఓ దుర్వినియోగం
పేదల కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జీఓ నంబర్ 463 తీసుకువచ్చింది. అర్హులు ఎవరైనా కొన్నేళ్లుగా ప్రభుత్వ భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నా, గృహాలు నిర్మించుకుని నివస్తున్నవారి కోసం ఈ జీఓను రూపొందించారు. అటువంటి వంటి వారు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తుని తహసీల్దార్ పరిశీలించి ఆర్డీఓకి పంపుతారు. రెవిన్యూ డివిజనల్ అధికారి ప్రొసీడింగ్స్ ఇచ్చాక తహసీల్దార్ నేరుగా రిజిస్టార్ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించేలా గత ప్రభు త్వం చర్యలు చేపట్టింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీఓ పూర్తిగా దుర్వినియోగం అవుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైతే అడిగినంత డబ్బులు ముట్టజెపుతారో వారికి తహసీల్దార్ వెళ్లి ప్లాటు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే స్తున్నారు. ఇటువంటి బోగస్ రిజిస్ట్రేషన్లు తిరుపతి పరిధిలో ఎక్కువగా జరిగినట్లు సమాచారం.
రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసిన పేరుని బోగస్ అని రౌండప్ చేసిన దృశ్యం
తిరుపతి రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో విశ్రాంత వీఆర్ఓ బ్రహ్మయ్య చౌదరి
ఆయనే అంతా..
తిరుపతి రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏడాది క్రితం ఉద్యోగ విరమణ పొందిన వీఆర్ఓ బ్రహ్మయ్య చౌదరిదే పెత్తనం నడుస్తోందని పలువురు అధికారులు ఆరోపిస్తున్నారు. ఏ ఫైల్ వచ్చినా ఆయన అనుమతి లేనిదే కదలదని చెబుతున్నారు. మ్యూటేషన్, ఎంజాయ్ మెంట్ సర్టిఫికెట్, హౌస్ సైట్, డైలీ రిజిస్టర్లో ఎంట్రీ చేయాలంటే ఆయన అనుమతి తప్పనిసరని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఏడాది నుంచి తహసీల్దార్ కార్యాలయంలో అనధికారంగా పెత్తనం చెలాయిస్తున్నారని ఉద్యోగుఉ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


