చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మెసానికల్ మైదానంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్షిప్ కప్ – 2026 జిల్లా స్థాయి పోటీలు బుధవారంతో ముగిశాయి. చివరి రోజు నాలుగు విభాగాల్లో పోటీలు నిర్వహించారు. బ్యాడ్మింటన్, ఖోఖో, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్ విభాగాల్లో పోటీలు హోరా హోరీగా సాగాయి. జిల్లా నలుమూలల నుంచి 667 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికవుతారని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఉదయభాస్కర్ తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలు ఈ నెల 20వ తేదీ నుంచి తిరుపతిలో జరిగే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అమరావతిలో జరిగే ప్రధాన వేడుకలో సీఎం చేతుల మీదుగా నగదు బహుమతులు అందజేస్తారని వెల్లడించారు.


