చిత్తూరు కలెక్టరేట్: ప్రభుత్వ వసతి గృహాల్లోకి విద్యార్థి సంఘాల ప్రవేశాలను, సమావేశాలను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్ఎస్యూ) చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కిరణ్ డిమాండ్ చేశారు. నగరంలో విద్యార్థి సంఘాలను హాస్టల్స్లోకి అనుమతించాలని కోరుతూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థి సంఘాల ప్రవేశం, సమావేశాలను నిషేధించడం అత్యంత అప్రజాస్వామికమైన చర్య అన్నారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో విద్యార్థి సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థి సంఘాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలన్నారు. నాయకులు శామ్యూల్, రెడ్డిప్రసన్న, రెడ్డెయ్య, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
చిరుధాన్యాలతో ఆరోగ్యం
శాంతిపురం: ఆహారంలో చిరుధాన్యాలను పెంచుకొంటూ ఆరోగ్యంగా ఉండాలని ఇండియన్ మిల్లెట్ మ్యాన్, పద్మశ్రీ డాక్టర్ ఖాదర్వలి చెప్పారు. శాంతిపురంలోని బాలాజీ కల్యాణ మండపంలో ఆదివరం సాయంత్రం జరిగిన చిరుధాన్యాలపై అవగాహన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మిల్లెట్స్ తింటూ జీవన శైలిలో మార్పులతో మధుమేహం, రక్తపోటు, ఊబకాయం వంటి జబ్బులను నియంత్రించవచ్చని అన్నారు. మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం వారు ఆహారంగా తీసుకున్న చిరుధాన్యాలలోనే ఉందన్నారు. ప్రభుత్వం చేపట్టిన కుప్పం మిల్లెట్ రివైవల్ ప్రాజెక్టు ద్వారా చిరుధాన్య ఆధారిత నియోజకవర్గంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, సేంద్రియ సేద్యం చేస్తున్న రైతులు పాల్గొన్నారు.
అప్పుడు కూడా
నీ గురించే ఆలోచిస్తా!
జీడీనెల్లూరులో చెట్టుకు ఉరివేసుకుని యువకుడి మృతి
గంగాధర నెల్లూరు : ‘చనిపోయిన ఏడు నిమిషాల తర్వాత వరకు మెదడు బతికే ఉంటుందట కదా..? అప్పుడు కూడా నేను నీ గురించే ఆలోచిస్తా..!’ అంటూ ఇన్స్ట్రాగామ్లో పోస్టుపెట్టి ఓ యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని తనువు చాలించిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. తాను మరణించబోతున్నానని.. మరణించిన తర్వాత ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అవుతారు.. అంటూ ఐదు రకాల స్టేటస్లు పెట్టి మృతి చెందాడు. ఇది స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్థానికుల వివరాల మేరకు.. గంగాధరనెల్లూరు మండలం, బంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పాకాలాయన, రాధిక కూమారుడు జనార్దన్రెడ్డి (24) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కొన్నేళ్ల క్రితమే తల్లిదండ్రులు మృతి చెందగా తనని పట్టించుకునే వారు లేక మద్యానికి బానిసమయ్యాడు. ఆదివారం ఉదయం గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉరి వేసుకుని విగత జీవవై వేలాడుతూ కనిపించాడు. మృతుని బంధువులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
చర్చనీయాంశంగా మారిన చివరి స్టేటస్
జనార్దన్ మరణించే 24 గంటల ముందు తన ఇన్స్ట్రాగామ్ స్టేటస్లో తాను చనిపోతున్నట్లు ఓ సినిమాకు సంబంధించిన స్టేటస్, అలాగే చనిపోయిన తరువాత తన మెదడు ఏడు నిమిషాలు పనిచేస్తుందని.. అప్పుడు కూడా ఒక అమ్మాయి గురించే ఆలోచిస్తుందని.. చనిపోయిన తర్వాత తన స్నేహితులు అంత్యక్రియలు బాధతో నిర్వహిస్తారని అర్థం వచ్చేలా స్టేటస్ వీడియోలు పెట్టాడు. ఆపై ఉరి వేసుకుని మృతి చెందాడు. ఇది ప్రతి ఒక్కరినీ కదిలించింది.


