చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈనెల 17న ఉద్యోగ మేళా (సీడాప్ జాబ్కనెక్ట్) నిర్వహించనున్నట్లు డీఆర్డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీఏ), సీడాప్ సంయుక్తంగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. కలెక్టరేట్ వద్ద ఉన్న టీటీడీసీ ప్రాంగణంలో ఉద్యోగ మేళా జరుగుతుందన్నారు. జిల్లాలోని 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు నిరుద్యోగులు అర్హులన్నారు. ఈ మేళాలో టీసీఎల్ (తిరుపతి), టాటా ఎలక్ట్రానిక్స్ (హోసూర్), బ్లింకిట్ (చైన్నె) తదితర కంపెనీలు హాజరవుతాయన్నా రు. ఎంపికయ్యే అభ్యర్థులకు సంబంధిత కంపెనీల నియమ, నిబంధనల మేరకు జీతాలు ఇస్తారని తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు వివరాలు నమోదు, ఇతర సమాచారానికి 8712495517, 9441872140 నంబర్లలో సంప్రదించాలన్నారు. హాజరయ్యే అభ్యర్థులు బయోడేటా, సర్టిఫికెట్లు(ఒరిజినల్, జిరాక్స్) తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని పీడీ కోరారు.
నిఘా సంస్థల పాత్ర కీలకం
తిరుపతి సిటీ: కృత్రిమ మేధస్సు అభివృద్ధి చెందుతున్న క్రమంలో శాంతి భద్రతలు, సామాజిక అంశాల నియంత్రణపై నిఘా సంస్థల పాత్ర కీలకంగా మారనుందని వీసీ టాటా నర్సింగరావు పేర్కొన్నారు. ఎస్వీయూ రాజనీతి శాస్త్రం, ప్రభు త్వ పాలనా శాస్త్ర విభాగం పూర్వ విద్యార్థుల సహకారంతో శుక్రవారం వర్సిటీ సెనేట్ హాల్లో ‘చట్టబద్ధ నిఘా రాజకీయ పరిణామాలు.. ఒక విమర్శాత్మక దృక్పథం’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వీసీ ముఖ్యఅతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం విశ్వవ్యాప్తంగా జరుగుతున్న పరిణా మాల దృష్ట్యా భారతదేశం నిర్ణయాత్మక పాత్ర పోషించాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. శాస్త్ర సాంకేతిక యుగంలో నిఘా సంస్థల ప్రాబల్యం గణనీయంగా పెరుగుతోందని తెలిపా రు. విభాగధిపతి ఆచార్య బీవీ మురళీధర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థల్లో నిఘా చర్యలు చట్టపరమైన విధానాల ద్వారా అమలవుతాయన్నారు. చట్టబద్ధ నిఘా ప్రధాన ఉద్దేశం జాతీయ భద్రతను కాపాడడం, నేరాలను నిరోధించడం, ప్రజాశాంతిని పరిరక్షించడమన్నారు. సదస్సుకు హాజరైన జార్ఘండ్ రాష్ట్ర మానవ వనరుల విభాగం పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ క్రాంతి కుమార్ గడిదేసి మాట్లాడుతూ ప్రధానంగా కృత్రిమ మేధస్సు పోలీసు వ్యవస్థపై ఎంతగానో ప్రభావం చూపుతోందని, పోలీసింగ్ డేటా ఆధారిత అంశాలపై ఆధారపడుతోందన్నారు. ఈ సదస్సులో డాక్టర్ సాంబమూర్తి, కోకన్వీనర్లు డాక్టర్ ఐఎస్ కిషోర్, పి సాయికుమారి, డాక్టర్ సీఎల్ చెన్నారెడ్డి పాల్గొన్నారు.


