చిత్తూరు కలెక్టరేట్ : ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను వెంటనే డుదల చేయాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కిరణ్, చిట్టుబాబు డిమాండ్ చేశారు. మంగళవారం సంఘం నేతలు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. అలాగే పీఆర్సీని నియమించాలన్నారు. 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని స్పష్టం చేశారు. టీచర్లకు అందాల్సిన సరెండర్, గ్రాట్యూటీ బకాయిలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర నేత సమీర్ మాట్లాడుతూ సీపీఎస్ ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్నారు. యాప్ల పేరుతో ఉపాధ్యాయులను బోధనకు దూరం చేస్తున్నారని విమర్శించారు. టీచర్లను బోధనేతర పనులకే పరిమితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్డ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెంగల్రాయ మందడి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారించలేదని మండిపడ్డారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ వాసుదేవన్కు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో నేతలు పరంధామనాయుడు, శ్రీదేవి, లత, మునికృష్ణయ్య, ధనంజయులు పాల్గొన్నారు.


