బడ్జెట్లో పేదలకు శఠగోపం
వెదురుకుప్పం : వైఎస్.జగన్మోహన్రెడ్డి ఇస్తున్న సంక్షేమంకంటే ఎక్కువ ఇస్తామని ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నిట్టనిలువునా మోసం చేస్తున్నట్టు మాజీ ఉప ముఖ్యమంత్రి కే.నారాయణస్వామి ధ్వజమెత్తారు. ఆయన ఆదివారం సాక్షితో మాట్లాడారు. విజనరీగా చెప్పుకుంటున్న చంద్రబాబు మూడో విడత ప్రవేశ పెట్టిన బడ్జెట్లో అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికొదిలేశారని విమర్శించారు. పేదలకు మూడు సెంట్లు స్థలం ఇస్తామన్న హామీ ఊసేలేదన్నారు. 20 లక్షల ఉద్యోగాలంటూ ఊదరగొట్టి ఒక్క జాబ్ కూడా ఇవ్వలేదన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి హామీని చెత్తబుట్టలో వేశారని పేర్కొన్నారు. 50 ఏళ్లకే పింఛను ఇస్తామని టోకరా పెట్టారని దుయ్యబట్టారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500ల చొప్పున ఆడబిడ్డ నిధి ఇస్తామని చెప్పి మోసం చేశారని తెలిపారు. కొత్తగా ఒక్క పింఛను కూడా ఇవ్వలేదన్నారు. విద్య, వైద్య రంగాలకు నిధు లు కేటాయించకుండా పీపీపీ విధానానికి ప్రాధాన్యత ఇస్తూ నిరుపేదల భవిష్యత్తును సర్వనాశనం చేసినట్లు వాపోయారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్ కళాశాలలను ప్రైవేటుకు అప్పగించి పేద విద్యార్థుల కు అన్యాయం చేశారని దుయ్యబట్టారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.40 వేల కోట్ల బకాయిల అతీగతీ లేదన్నారు. వలంటీర్ వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు నెలకు రూ.10 వేలు ఇస్తామని చెప్పి వారి కుటుంబాలను వీధిన పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సున్నా వడ్డీ కింద రుణాలు ఇస్తామని చెప్పి మహిళలను దగా చేసినట్లు చెప్పారు. రైతులు అప్పులు ఊబిలో కూరుకుపోతున్నా ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉన్నట్లు మండిపడ్డారు. రాష్ట్రాన్ని తాకట్టుపెట్టి ఇష్టారాజ్యంగా అప్పులను తీసుకువస్తున్నారని, ఆ డబ్బును తమ వారికి దోచిపెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు చేస్తున్న మోసాలు, అరాచకాలపై నిలదీస్తే తప్పుడు కేసులు పెట్టి ప్రతిపక్షాల గొంతునొక్కుతున్నారని మండిపడ్డారు. ప్రజల్లో తిరుగుబాటు వస్తున్న నేపథ్యంలో డైవర్షన్, కల్తీ రాజకీయాలు చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేరోజులు త్వరలోనే వస్తాయని పేర్కొన్నారు.


