మేలుకో..రిజిస్ట్రేషన్ చేసుకో!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు ప్రక్రియ జిల్లాలో వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 75 శాతం మంది రైతులు నమోదు చేసుకున్నారు. మిగిలిన వారు ఇంకా నమోదు చేయించుకోకపోవడంతో, తక్షణమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తద్వారా జరిగే ఉపయోగాలను వెల్లడిస్తున్నారు.
రిజిస్ట్రేషన్ తప్పనిసరి
ఇప్పటి వరకూ రైతులకు సంబంధించిన ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, బీమా వంటి సేవలు వివిధ జాబితాల ఆధారంగా అమలయ్యాయి. అయితే రాబోయే రోజుల్లో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఉన్న రైతులకే అన్ని రైతు సేవలు అమలు చేయనున్నట్లు వ్యవసాయశాఖ స్పష్టం చేసింది. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆధార్ తరహాలో 11 అంకెల విశిష్ట సంఖ్యను అందజేయనున్నారు. నమోదు లేకపోతే పథ కాల లబ్ధి పొందే అవకాశం ఉండదని చెబుతున్నారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ద్వారా రైతుల భూ వివరాలు, పంటల సమాచారం, ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు ఒకే డేటాబేస్లో నమోదవుతాయి. దీనివల్ల నిజమైన రైతులకు మాత్రమే లబ్ధి, నకిలీ లబ్ధిదారులకు అడ్డుకట్ట, పథకాల అమలులో పారదర్శకత సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు.
ఇంకా 43,807 మంది
జిల్లా వ్యాప్తంగా 1,74,716 మందికి రిజిస్ట్రేషన్చేయాల్సి ఉండగా... ఇప్పటి వరకు1,30,909 మందికి నమోదు పూర్తిచేశారు. ఇంకా 43,807 మందికి పూర్తి చేయాల్సి ఉంది. అయితే డోర్లాక్, డెత్ కేసులతో ఈ నమోదు పక్రియ తడబాటు ఎదరవుతోందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. దీనికి తోడు అదనపు సర్వేలు సైతం వేధిస్తున్నాయని వాపోతున్నారు.
ఫార్మర్ రిజిస్ట్రేషన్ కీలకం
రాబోయే రోజుల్లో పంట బీమా, నష్ట పరిహారం, ఇన్న్పుట్ సబ్సిడీలు, రైతు సేవా కేంద్రాల సేవలు వంటి అన్ని అంశాలు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆధారంగానే అమలు చేయనున్నారు. ఇప్పుడే నమోదు చేసుకోకపోతే భవిష్యత్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫార్మర్ రిజిస్ట్రేషన్ రైతుల భవిష్యత్తుకు కీలకం. ప్రతి రైతు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. – మురళీ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
మేలుకో..రిజిస్ట్రేషన్ చేసుకో!


