పుత్తూరు: ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త రైల్వేలైను ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. పుత్తూరు, తమిళనాడులోని అత్తిపట్టు మధ్య రైల్వేలైను ఏర్పాటుకు కేంద్రం రూ.517.47 కోట్లు మంజూరు చేయడంతో ఈ ప్రక్రియ వేగవంతమైంది. అత్తిపట్టు–పుత్తూరు మధ్య 88.30 కి.మీ మేర రైల్వేలైను రూట్ మ్యాప్ను అధికారులు సిద్ధం చేశారు. ఈ రూట్లో మొత్తం 8 స్టేషన్లను ప్రతిపాదించారు. అందులో నాలుగు స్టేషన్లు ఏపీలో ఉండగా, మరో నాలుగు తమిళనాడులో ఉంటాయి. తిరుపతి జిల్లాలోని పుత్తూరు నుంచి ప్రారంభమయ్యే ఈ రైల్వే లైను నారాయణవనం, కృష్ణమరాజుకండ్రిగ, పిచ్చాటూరు, నాగలాపురం స్టేషన్లు ప్రతిపాదించారు. పుత్తూరు నుంచి నారాయణవనం రైల్వే స్టేషన్కు మూడు కి.మీ దూరం ఉండగా, అక్కడ నుంచి కృష్ణమరాజుకండ్రిగ, పిచ్చాటూరు, నాగలాపురం స్టేషన్ల మధ్య దూరం 10 కి.మీగా ఉంటుంది. అలాగే తమిళనాడులోని ఊత్తుకోట, పాలవాక్కం, పెరియపాళెం, గంగయాదికుప్పంలో స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. పుత్తూరు–అత్తిపట్టు రైల్వే మార్గంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఆరు బోగీలతో నాలుగు ఈఎంయూలు నాలుగు ట్రిప్పులు తిరగనున్నాయి. ఈ రైల్వే లైను ఏర్పాటు పూర్తయితే తిరువళ్లూరు, పుత్తూరు రూట్లో రద్దీ తగ్గుతుందని రైల్వేశాఖ భావిస్తోంది.
2024 నుంచే భూసేకరణ
పుత్తూరు–అత్తిపట్టు మధ్య కొత్త రైల్వే లైను కోసం 2024 డిసెంబర్ 6 నుంచే భూసేకరణ పనులకు రైల్వే శాఖ అనుమతించింది. 88 కి.మీ దూరం కలిగిన ఈ రైల్వే లైనుకు 189 హెక్టార్ల భూములును సేకరించాల్సందిగా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.
పుత్తూరులో కొత్తగా ఏర్పాటు చేస్తున్న డెడ్ఎండ్ లూప్లైన్
పుత్తూరు రైల్వే స్టేషన్


