చిత్తూరు కలెక్టరేట్ : టీచర్ల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని వైఎస్ఆర్టీచర్స్ అసోసియేషన్ నాయకులు ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్రెడ్డిని కోరారు. ఆ సంఘ నాయకులు నెల్లూరులోని ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్సీని కలిసి వినతిపత్రం అందజేశారు. వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వీ.రెడ్డిశేఖర్రెడ్డి మాట్లాడుతూ టీచర్ల ప్రయోజనాలకు కూటమి ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి సమస్యలు పరిష్కరించాలన్నారు. కొత్త పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయడంతో పాటు, తక్షణమే తాత్కాలిక భృతిని ప్రకటించాలన్నారు. ఉపాధ్యాయులకు రావాల్సిన అన్ని రకాల బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. 2003 డీఎస్సీలో నియామకమైన టీచర్లకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. అర్హులైన స్కూల్ అసిస్టెంట్లకు జూనియర్ లెక్చరర్లుగా తక్షణమే ఉద్యోగోన్నతులు కల్పించాలన్నారు. హైస్కూల్ ప్లస్ పాఠశాలలను బలోపేతం చేసి, అక్కడ ఖాళీగా ఉన్న పీజీటీ పోస్టులను వెంటనే భర్తీ చేయించాలన్నారు. ఎమ్మెల్సీ స్పందిస్తూ టీచర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. టీచర్ల పక్షాన నిలబడి సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జైకాంత్, గౌరవ అధ్యక్షులు సోమచంద్రారెడ్డి, నాగభూషణం పాల్గొన్నారు.


