చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ నివాసాలకు ఉచితంగా సౌరఫలకాల ఏర్పాటుపై ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు ఆరా తీశారు. శుక్రవారం ఎస్ఈ కార్యాలయంలో జిల్లాలోని అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ పొందుతున్న ఎస్సీ, ఎస్టీ సర్వీసులు 85,974 ఉన్నాయని, అందులో ఇంటి పైకప్పు సౌలభ్యం లేని వారు.. ఇతర సమస్యలతో ఉన్న వారు వేలాది మంది ఉన్నారన్నారు. మొదటి దశలో 21,500 నివాసాలకు సౌరఫలకాల ఏర్పాటుకు టెండర్లు ఇచ్చినట్టు తెలిపారు. కానీ ఇంతవరకు ఎందుకు ఏర్పాటు చేయలేదని అధికారులను నిలదీశారు. ప్రతి సర్వీసుకు 2 కిలోవాట్ల సామర్థ్యం గల సౌరఫలకాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పనులు వేగవంతం కావాలన్నారు. సంబంధిత మెటీరియల్స్ తిరుపతిలోని గోడౌన్లో పెట్టారని, వాటిని చిత్తూరుకు తరలించాలన్నారు. ఈఈలు మునిచంద్ర, సురేష్, మోహనమ్మ, పీఓ రెడ్డెప్ప, డీఈలు ప్రసాద్, శేషాద్రి, కొండయ్య పాల్గొన్నారు.


