కరెంటు కుట్ర!
ఏడాది క్రితం తవ్విన వ్యవసాయ బోరుకు ఇప్పటికీ ఇవ్వని కరెంటు గత మార్చిలోనే కనెక్షన్ మంజూరు జూలైలో మెటీరియల్ ఇచ్చినా కనెక్షన్ ఇవ్వకుండా మోకాలడ్డు అధికార పార్టీలో చేరితేనే అంటూ కూటమి నేతల హుకుం నిశ్చేష్టంగా కుప్పం రెస్కో యంత్రాంగం
శాంతిపురం: గ్రామాల్లో తమ పంతం నెగ్గించుకోవడానికి, ఇతర పార్టీల వారిని ఇబ్బంది పెట్టడానికి అధికారులను వాడుకోవడం అధికార పార్టీ నాయకులకు అలవాటైపోయింది. వ్యవసాయ అవసరాల కోసం తవ్వుకున్న బోర్లకు కరెంటు కనెక్షన్ ఇవ్వడంలోనూ తమ నిరంకుశత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. మండలంలోని సి.బండపల్లి పంచాయతీ మహిళా సర్పంచ్ శకుంతల కుటుంబం రాజకీయ వేధింపులతో తీవ్ర క్షోభను అనుభవిస్తోంది. శకుంతల, ఆమె భర్త కుమారరాజ తమ వ్యవసాయ బోరులో నీరు నామమాత్రంగా రావడంతో పశుగ్రాసం సాగు చేసి, పశువులు పెంచుతూ నలుగురు పిల్లలను చదివించుకునేవారు వారు. సాగు నీరు ఉంటే వర్షాధారంగా ఉన్న 7.5 ఎకరాలలోనూ వ్యవసాయం చేయొచ్చనే ఆశతో తమ పొలంలో నాలుగు బోర్లు తవ్వించినా వాటిలో నీరు రాలేదు. కొద్దోగొప్పో నీరున్న బోరు కూడా ఇంకిపోవడంతో పాడి పశువులను కూడా అమ్ముకుని 2025 జనవరిలో మరో బోరు తవ్విస్తే నీరు పుష్కలంగా పడ్డాయి. ఆ ఆనందంలో కరెంటు కనెక్షన్ కోసం గత ఫిబ్రవరిలో కుప్పం రెస్కోకు దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు ఎస్టిమేషన్ ఇవ్వడంతో ఎలాగోలా తంటాలు పడి గత మార్చిలో ఆ మొత్తాన్ని రెస్కోకు చెల్లించారు. జూన్లో వారికి కావాల్సిన ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ స్తంభాలు, తీగలు, ఇతర సామగ్రిని రెస్కో అధికారులు ఇచ్చారు.
పార్టీ మారితేనే కరెంటు
రాజకీయ క్రీడ
స్తంభాలు నాటి లైన్లు లాగడం మొదలు పెట్టగానే స్థానిక కూటమి నాయకులు రంగంలోకి దిగారు. విద్యుత్ కనెక్షన్ ఇవ్వకుండా రెస్కో అధికారులపై ఒత్తిడి తెచ్చి పనులు ఆపించారు. శకుంతలమ్మ బోరుకు కరెంటు కోసం మరో రైతు పొలంలో లాగిన తీగిలను అడ్డంగా అలాగే వదిలేసి రెస్కో సిబ్బంది వెనుదిరిగారు. అక్కడ ఏర్పాటు చేసేందుకు తెచ్చిన ట్రాన్సుఫార్మర్ అప్పటి నుంచి ట్రాక్టర్ ట్రాలీలో అలాగే మిగిలిపోయింది. సమీపంలోని మరో ట్రాన్స్ఫార్మర్ నుంచి కరెంటు తీసుకుని మోటారు నడిపే ప్రయత్నం చేసినా రెస్కో సిబ్బందిని పురమాయించి ఒక్క రోజులోనే వైర్లను కత్తిరించేశారు. తమ కరెంటు కనెక్షన్ కోసం రెస్కో అధికారుల చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణ చేసినా ఫలితం లేకపోయిందని బాధితుడు కుమారరాజ వాపోయాడు. స్థానిక నాయకులను కలిసి ఆ తర్వాత రెస్కో అధికారులతో చెప్పించాలని సలహా ఇచ్చారని చెప్పాడు. తమ గ్రామానికి చెందిన మరో రైతు వెంకటేష్ భూముల వ్యవహారం కోర్టులో ఉంటే దాంతో ఎలాంటి సంబంధం లేని తమ భూములు కోర్టులో ఉన్నాయని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.
అభ్యంతరాలతో పనులు ఆపాము
శకుంతలమ్మకు సంబంధించిన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ పనులను ఎప్పుడో చేపట్టాం. కానీ కొందరు స్థానికులు దీనిపై లిఖిత పూర్వకంగా అభ్యంతరం తెలిపారు. ఆపై క్షేత్ర స్థాయిలో అడ్డుకోవడంతో పనులు ఆపేశాము. కొత్తగా సర్వీసు తీసుకున్న భూమి రెవెన్యూ రికార్డుల్లో యజమాని పేరు మార్చారు. కోర్టు వివాదంలో ఉందని వారు చెప్పారు. కోర్టు నుంచి దీనిపై మాకు ఎలాంటి ఆదేశాలు గానీ, సమాచారం గానీ లేదు. గ్రామస్తుల మధ్య వివాదం లేకుంటే విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు.
– మునిరత్నం, రెస్కో ఏఈ, శాంతిపురం
కరెంటు కుట్ర!


