అప్పుడే పోలీసులను ఆశ్రయించినా!
చిత్తూరు అర్బన్: ప్రేమించిన వ్యక్తి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో కవిత ముందే పోలీసులను ఆశ్రయించారు. కానీ బాధితురాలి ఫిర్యాదుపై మద్య స్తం చేయడంతో కేసును వెనక్కి తీసుకున్నారు. తీరా నమ్మించిన వ్యక్తే ప్రాణాలు తీసేశాడు. చిత్తూరుకు చెందిన విభిన్న ప్రతిభావంతురాలు కవిత హత్య కేసులో పలు ఆసక్తికర ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈమెను హత్య చేసింది ప్రేమికుడు గణేష్ అని పోలీసులు నిర్ధారించారు.
గతంలో స్టేషన్కు
కవిత–గణేష్ ఇద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే నిరుద్యోగిగా ఉన్న సమయంలో వీళ్ల ప్రేమకు ఎలాంటి ఇబ్బందీ రాకపోవడంతో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. తీరా గణేష్కు ఎస్బీఐలో ఉద్యో గం రావడం, ఆమె తనకన్నా 12 ఏళ్లు వయస్సులో పెద్దదికావడంతో కవితను పెళ్లి చేసుకోవడానికి నిందితుడు ఒప్పుకోలేదు. తనను మోసం చేస్తున్నాడని గ్రహించిన కవిత గతంలో పోలీసులను ఆశ్రయిస్తే.. విభిన్న ప్రతిభావంతుల సంఘ నాయకులు రావడంతో కేసు పెట్టకుండా పోలీసులు రాజీ చేశారు. ఆపై కవితను ఆమె ప్రియుడు కొట్టిచంపాడు.
అంత్యక్రియలు పూర్తి
కవిత మృతదేహానికి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. గురువారం గిరింపేటలోని శ్మశాన వాటిలో కవిత మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. మృతురాలి తలపై నాలుగు బలమైన గాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. అవయవాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు.
పోలీసులపై ఫిర్యాదు
ఈ కేసు దర్యాప్తులో పోలీసులు నిర్లక్ష్యం వహించారంటూ చిత్తూరుకు చెందిన న్యాయవాది అర్హద్ జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు.
గతంలో రాజీ చేసుకున్నారు
వయస్సు తేడా ఉండడం, ఉద్యోగం రావడంతో ఆమెను వదిలించుకోవడానికి గణేష్ హత్య చేశాడు. గతంలో కూడా తనను మోసం చేశాడంటూ కవిత పోలీసులను ఆశ్రయిస్తే.. వికలాంగ జేఏసీ నేతలు వచ్చి గణేష్–కవితతో మట్లాడగా వివాహం చేసుకోవడానికి గణేష్ ఒప్పుకున్నాడు. దీంతో కేసు వద్దంటూ రాజీ చేసుకున్నారు. ఈ కేసులో ఎక్కడా కూడా పోలీసుల నిర్లక్ష్యం లేదు. కవిత కనిపించకుండా పోయిన రోజే హత్యకు గురయ్యారు. నిందితుడిని త్వరలోనే అరెస్టు చూపిస్తాం.
– సాయినాథ్, డీఎస్పీ, చిత్తూరు


