చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా మార్చి 16 నుంచి ప్రారంభమైన పది పబ్లిక్ పరీక్షలు గురువారంతో ముగిశాయి. చివరి రోజు ఇంగ్లిష్ పరీక్ష జరిగింది. జిల్లాలో 129 పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా అధికారులు పరీక్షలు నిర్వహించారు. డీఈవో రాజేంద్రప్రసాద్ పర్యవేక్షణలో ఎలాంటి మాల్ప్రాక్టీస్, డీబార్ కేసులు లేకుండా కట్టుదిట్టంగా పూర్తిచేశారు.
‘సాక్షి’ మెటీరియల్ ఎంతో ఉపయోగం
జిల్లాలో పరీక్షలు రాసిన కొందరు విద్యార్థులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సాక్షి పంపిణీ చేసిన మెటీరియల్స్ తమకు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు. అందులోనుంచే చాలా వరకు ప్రశ్నలు వచ్చాయని వెల్లడించారు. గణితం, సైన్స్ కొంచెం ఆలోచింపజేసేలా ఉన్నప్పటికీ, సగటు విద్యార్థి కూడా ఉత్తీర్ణత సాధించేలా ప్రశ్నలు వచ్చాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మూల్యాంకనం, ఫలితాలు
విద్యాశాఖ ప్రస్తుతం మూల్యాంకనం (స్పాట్ వాల్యూయేషన్) పై దృష్టి సారించింది. జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియకు కసరత్తు చేపట్టారు. మూల్యాంకనం పూర్తి చేసి, మే మొదట , రెండవ వారంలో ఫలితాలను విడుదల చేసేలా చర్యలు చేపడుతున్నారు.
విహారయాత్రలకు సిద్ధం
పరీక్షల ఒత్తిడి నుంచి బయటపడిన విద్యార్థులు ఇప్పుడు సెలవుల మూడ్లోకి వెళ్లిపోయారు. వేసవి సెలవులను ఎంజాయ్ చేసేందుకు పర్యాటక ప్రాంతాలకు ప్లాన్ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు, పై చదువుల కోసం (ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్) కోచింగ్ సెంటర్ల చుట్టూ విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రదక్షిణలు మొదలుపెట్టారు.


