బంగారుపాళెం: సంక్షేమ హాస్టళ్లపై నిర్లక్ష్యం చేయెద్దని జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ అధికారులను ఆదేశించారు. గురువారం మండల కేంద్రం బంగారుపాళెంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. తొలుత ఎస్సీ బాలికల హాస్టల్, అనంతరం బీసీ బాలికల హాస్టల్, తరువాత ఎస్సీ బాలుర ఇంటిగ్రేటెడ్ హాస్టల్ను తనిఖీ చేశారు. వసతి గృహాల్లో విద్యార్థుల హాజరు, స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న భోజన సౌకర్యాలు, వసతులు, పారిశుధ్య పరిస్థితులపై ఆరా తీశారు. మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా లేదా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. బాలికలతో మాట్లాడుతూ సమస్యలు ఎమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. వార్డెన్లు మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా, ఇబ్బందులకు గురిచేస్తున్నారా..? అనే విషయాల గురించి అడిగి తెలుసు కున్నారు. విద్యార్థులు బాగా చదువుకోవాలన్నారు. వార్డన్లు వసతి గృహాల నిర్వాహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. చివరగా బంగారుపాళెం ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేశారు. అక్కడ రోగులకు అందుతున్న సదుపాయాలు, మందులు, సిబ్బంది కొరతపై ఆరా తీశారు. అనంతరం డయాలసిస్ సెంటర్ను తనిఖీ చేశారు. ఎంతమంది రోగులు కేంద్రానికి వచ్చి డయాలసిస్ చేసుకుంటున్నారు... సౌక ర్యాలు ఎలా ఉన్నాయని అక్కడి నిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో కరంట్ ఆఫ్ చేసే సందర్భంలో రోగులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని, ప్రభుత్వ ఆసుపత్రికి ప్రత్యేక కరంటు లైన్ ఏర్పాటు చేయాలని సిబ్బంది కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఆయన వెంట తహసీల్దార్ షబ్బీర్బాషా, డిప్యూటీ ఎంపీడీఓ పురుషోత్తం ఉన్నారు.


