బాధల బదిలీలు
● మెడికల్ సమస్యలు ఉన్న టీచర్ల పరిస్థితి దారుణం ● అంగవైకల్యం తగ్గించి ఇచ్చిన సర్టిఫికెట్లతో ఆందోళన ● ప్రభుత్వ తీరుపై భగ్గుమంటున్న టీచర్లు
గతం...ప్రస్తుతానికి పొంతనే లేదు...
గతంలో ఉన్న అంగవైకల్యం శాతానికి ఇప్పుడు రుయా మెడికల్ బోర్డు ఇచ్చిన శాతానికి పొంతనే లేకుండా పోయింది. చికిత్సలకు వెళ్లిన టీచర్లలో చాలా మందికి బహిరంగంగానే అంగవైకల్యం కనిపిస్తోంది. అయితే తక్కువ శాతం నమోదు చేసి ఇవ్వడంపై టీచర్లు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. మెడికల్ శాతం తక్కువగా నమోదు చేయడంపై వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు మరోసారి మెడికల్ పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు. బాధిత టీచర్లు పలువురు రుయా అధికారులను కలవగా డీఈఓ ఉత్తర్వులు తెచ్చుకోవాలని తేల్చిచెప్పేశారు.
చిత్తూరు కలెక్టరేట్ : టీచర్ల బదిలీల్లో సమస్యలపై గురువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మెడికల్ సమస్యలు ఉన్న టీచర్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మెడికల్ బోర్డులు అంగవైకల్యం శాతం తక్కువగా నమోదు చేస్తూ జారీ చేసిన సర్టిఫికెట్లతో బదిలీల్లో మొదటి అవకాశం కోల్పోతున్న పరిస్థితి ఏర్పడుతోందని బాధిత టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మెడికల్ సమస్యలున్న టీచర్లకు అన్యాయం
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విభిన్న ప్రతిభావంతుల కోటాలో ఉద్యోగాలు పొందిన వారు, వయస్సు ప్రభావంతో మెడికల్ సమస్యలు ఏర్పడిన వారు, ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా అంగవైకల్యం ఉన్న టీచర్ల కు బదిలీల్లో మొదటి అవకాశం కల్పిస్తారు. ఇందుకు మెడికల్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ ఆధారంగా దరఖాస్తు చేసుకుంటారు. టీచర్లకు ఇటీవల తిరుపతి జిల్లా రుయా ఆసుపత్రిలో ప్రత్యేక మెడికల్ క్యాంపులు నిర్వహించారు. ఆ క్యాంపుల్లో గతంలో ఉన్న సర్టిఫికెట్లు కాకుండా కొత్తగా మెడికల్ సర్టిఫికెట్లు జారీచేశారు. ఈ ప్రక్రియ రుయా ఆసుపత్రి మెడికల్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఆందోళనలో గురువులు
గతంలో ఎన్ని సంవత్సరాలు సర్వీస్ ఉంటే అన్ని పాయింట్లు ఏడాదికి మూడు చొప్పున కేటాయించేవారు. ఇప్పుడు పాయింట్లకు ఎనిమిది సంవత్సరాల సీలింగ్ పెట్టారు. అంతకు మించి సర్వీస్ ఉన్నా పాయింట్లు నమోదు లేకుండా చేశారు. దీంతో 2014 డీఎస్సీ, 2016 స్పెషల్ డీఎస్సీ, 2015 లో బదిలీ అయిన టీచర్లకు నష్టం వాటిల్లుతుందని టీచర్లు గగ్గోలు పెడుతున్నారు.
న్యాయం చేయాలి
జిల్లాలో చాలా మంది టీచర్లు గతంలో పొందిన అంగవైకల్యం శాతంకు ప్రస్తుతం పొందిన అంగవైకల్యం శాతంకు వ్యత్యాసం ఉంది. ఈ విషయంలో కొంత మంది టీచర్లు తమ సంఘం దృష్టికి తీసుకొచ్చారు. ఇటీవల తిరుపతి జిల్లా రుయాలో చేపట్టిన ఆరోగ్య పరీక్షల్లో అన్యాయం జరిగిందని బాధిత టీచర్లు వాపోతున్నారు. విద్యాశాఖ అధికారులు పునఃపరిశీలన చేసి వారికి న్యాయం చేయాలి.
– జీవీ రమణ, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, చిత్తూరు జిల్లా
బాధల బదిలీలు


