
మత్తు మందు చల్లి చైను లాక్కెళ్లారు!
పుంగనూరు: కూరగాయల సంతకు వచ్చిన ఓ వృద్ధురాలిపై మత్తుమందు చల్లి చైను లాక్కెళ్లిన సంఘటన సోమవారం పట్టణంలోని కూరగాయల సంతలో జరిగింది. సీఐ సుబ్బరాయుడు కథనం మేరకు.. రామసముద్రం మండలం కొండూరు గ్రామానికి చెందిన సరోజమ్మ సొంత పనుల నిమిత్తం పుంగనూరుకు వచ్చి సంతలో కూరగాయలు కొనుగోలు చేసేందుకు వెళ్లింది. అక్కడ ఇద్దరు యువకులు ఆమైపె మత్తుమందు చల్లారు. ఆమె ఏమి తెలియని స్థితికి వెళ్లిపోవడంతో చైనులాకెళ్లి పరారయ్యారు. ఆమె స్పృహలోనికి వచ్చి లబోదిబో మంటు కేకలు వేయడంతో స్థానికులు ఆమెను తీసుకెళ్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయించారు. సుమారు 34 గ్రాములు బంగారు చైనును లాకెళ్లినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ఎస్ఐ లోకేష్ నిందితుల ఆచూకీ కోసం సీసీ పుటేజ్లను పరిశీలిస్తున్నారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
పుంగనూరు: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. పుంగనూరు మండలంలోని చిన్నతాండా గ్రామానికి చెందిన బుక్యా విశ్వనాథనాయక్(37) గత వారం శరీరంపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఇరువర్గాల ఘర్షణ
–ఇద్దరికి గాయాలు
వెదురుకుప్పం: మండలంలోని వేణుగోపాలపురం వడ్డిఇండ్లు గ్రామంలో సోమవారం జరిగిన పరస్పర దాడుల్లో ఇరువురికి గాయాలైనట్లు ఎస్ఐ వెంకటసుబ్బయ్య తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు.. వేణుగోపాలపురం వడ్డిఇండ్లు గ్రామానికి చెందిన రాజవేలు అదే గ్రామానికి చెందిన కన్నయ్య వద్ద రూ.3.50 లక్షలు అప్పు చేశాడు. సోమవారం అప్పు ఇస్తానని ఇవ్వలేని పక్షంలో ప్లాట్ రాసిస్తానని గతంలో పంచాయితీ చేశారు. సోమవారం కన్నయ్య వెళ్లి రాజవేలును అప్పు తీర్చమని అడిగాడు. లేని పక్షంలో ప్లాట్ రాసివ్వాలని కోరాడు. దీంతో రాజవేలు అయన అల్లుడు లోకేష్ కలిసి డబ్బుల్లేవు, ప్లాట్ ఇచ్చేది లేదంటూ దూషించారు. దీంతో మాటమాట పెరిగిన ఇరువర్గాల వారు తాటి మట్టలతో పరస్పర దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో ఇద్దరికి గాయాలై తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఎస్ఐ చెప్పారు. ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
అయూబ్ఖాన్కు నేషనల్ ఎక్స్లెన్సీ అవార్డు
పుంగనూరు: సామాజిక సేవకుడు, అబ్దుల్ కలామ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ పి.అయూబ్ఖాన్కు సోమవారం నేషనల్ ఎక్స్లెన్నీ అవార్డును ఢిల్లీలో ప్రదానం చేశారు. నూఢిల్లీలోని మహారాష్ట్ర సదన్లో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ బాలకృష్ణన్, సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అగర్వాల్ చేతులు మీదుగా అవార్డును ఆయన అందుకున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనందుకు భారత్ మన్చ్ ట్రస్ట్, ఇండియన్ గెలాక్సీ వారు సంయుక్తంగా ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు అయూబ్ఖాన్ను అభినందించారు.