
అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ఇవ్వాలని ధర్నా
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు మే నెల మొత్తం వేసవి సెలవులు ప్రకటించాలని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు ప్రేమ డిమాండ్ చేశారు. ఆ సంఘ నాయకులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఎండలు మండుతున్నాయని తెలిపారు. పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కొత్తగా ప్రవేశపెట్టిన బాల సంజీవని, 2.0.0 యాప్, ఈకేవైసీ ఓటీపీ ప్రక్రియలు ఎత్తివేయాలన్నారు. ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ వేసవిని దృష్టిలో పెట్టుకుని అంగన్వాడీ చిన్నారులకు మే నెల మొత్తం టేక్ హోం రేషన్తో సెలవులు ఇవ్వాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఫ్యాన్లు సైతం లేవన్నారు. ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు సెలవులు ప్రకటించారని, అంగన్వాడీ చిన్నారులకు మాత్రం సెలవులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ధర్నాలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, జిల్లా అధ్యక్షులు ప్రభావతి, నాయకులు అరుణ, హైమావతి, కాంచన, రాజేంద్ర, రఘు, రవి తదితరులు పాల్గొన్నారు.