
వక్ఫ్ సవరణ వద్దని రోడ్డెక్కిన ముస్లింలు
పుంగనూరు: వక్ఫ్ చట్ట సవరణ వద్దని ముస్లింలు పుంగనూరులో శుక్రవారం రోడ్డెక్కారు. కేంద్ర ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లును తిరస్కరిస్తున్నామని, తమ సత్తా చాటుతామని, రాజీపడే ప్రసక్తే లేదని ముస్లింలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వందలాది మంది ముస్లింలు నమాజ్ పూర్తి చేసుకుని, ర్యాలీగా పట్టణంలోని ఇందిరా సర్కిల్ చేరుకున్నారు. నల్ల జెండాలు, ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ప్రజాస్వామ్యదేశంలో మతాలకార్చిచ్చుకు ప్రభుత్వమే పునాది వేస్తోందని ముస్లిం నేతలు మండిపడ్డారు. హిందు మతానికి చెందిన వాటిలో ముస్లింలకు సభ్యత్వం ఉండదని, అలాంటి నిబంధనలు ఉన్న సమయంలో ముస్లింలపైన, వారి ఆస్తులపైన అన్యమతస్తులకు పెత్తనం చెలాయించేందుకు అధికారం ఎలా ఇస్తారంటు నిలదీశారు. ప్రభుత్వం ఈ విషయంపై చర్యలు తీసుకుని, వక్ఫ్ బోర్డు బిల్లును ఉపసంహరించుకోవాలని, లేకపోతే ఐకమత్యంతో పోరాటం చేసి, సాధించుకుంటామని హెచ్చరించారు. ఈ ర్యాలీలో ముస్లిం నాయకులు ముజాహిద్, యూనస్, జవహార్, అయాజ్, మమ్ము, జమీర్, రఫిక్, నూర్, అయూబ్, అస్లాం, ఎస్.రఫిక్, ఇమ్రాన్, సల్మాన్, పర్వేజ్, యాసిన్, నజీర్ తో పాటు వక్ఫ్ బోర్డు కమిటి సభ్యులు పాల్గొన్నారు.