
పుంగనూరు అభివృద్ధిని ఓర్వలేకే విమర్శలు
● ఒక నియోజకవర్గాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ● జెడ్పీలో శాసనసభ అంచనాల కమిటీ సమావేశం ● కూటమి ఎమ్మెల్యేలకు చురకలంటించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ● పలు శాఖల అధికారులతో సమీక్షించిన కమిటీ చైర్మన్ జోగేశ్వరరావు
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజలకు చేయాల్సిన, చేసిన అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించేందుకు శాసనసభ అంచనాల కమిటీ బుధవారం సమావేశం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఈ సమావేశం నిర్వహించారు. సమావేశం నియమ నిబంధనల ప్రకారం సమీక్ష నిర్వహించాల్సి ఉండగా కూటమి ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగా పుంగనూరు నియోజకవర్గంపై అక్కసుతో ప్రసంగించారు. పుంగనూరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ఓర్వలేక సూటిపోటి మాటలు గుప్పించారు. కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలకు కమిటీ సభ్యురాలు ఎమ్మెల్సీ కళ్యాణి ధీటుగా సమాధానం ఇచ్చారు. పుంగనూరు నియోజకవర్గంలో ఎందుకు అంత నిధులు ఖర్చు పెట్టారని, మిగిలిన నియోజకవర్గాల్లో ఎన్ని పనులు చేశారని ఆరా తీశారు. ఇందుకు ఎమ్మెల్సీ కళ్యాణి స్పందిస్తూ.. ఇది జిల్లా సమీక్ష అని, ప్రత్యేకంగా ఒక నియోజకవర్గాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ధీటుగా బదులిచ్చారు. నియోజకవర్గం పరిస్థితులను బట్టి పనులు మంజూరు చేస్తారని, కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు వెంటపడి పనులు చేసుకోవడం సహజమన్నారు. గత పాలనలో జరిగిన అభివృద్ధిని ఓర్వలేక ఇలా చేయడం సబబు కాదన్నారు. అలాగైతే గత పది సంవత్సరాల నివేదికలను సిద్ధం చేసి సమీక్ష నిర్వహించాలన్నారు. అలా చేస్తే ఏ ప్రభుత్వం పాలనలో ఎంత అభివృద్ధి జరిగిందో తెలుస్తుందని చురకలంటించారు.
శాఖల వారిగా ఖర్చుల వివరాలు సరిగ్గా లేవు..
జిల్లాలో శాఖల వారిగా చేసిన ఖర్చుల వివరాలు సరిగ్గా లేవని శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ జోగేశ్వరరావు మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఖర్చు చేసిన పనులను విభజించి ఎంత మొత్తం ఖర్చు చేశారో నివేదికలు సిద్ధం చేసి కమిటీకి పంపాలన్నారు. జిల్లాలో శాసనసభ అంచనాల కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలపై ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.
తాగునీటి పనులకు ప్రాధాన్యం
జిల్లా పరిషత్ నిధులతో తాగునీటి పనులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జిల్లాలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఎక్కువగా మామిడి, టమాట, పూలసాగు, ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ఏరియా, సీహెచ్సీ, పీహెచ్సీలలో ప్రస్తుతం కేటాయిస్తున్న నిధులను పెంచాలని చెప్పారు. మిషన్ వాత్సల్య పథకంలో నగదు మొత్తాన్ని పెంచాలన్నారు. సమీక్షలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్్ , శాసనసభ అంచనాల కమిటీ డిప్యూటీ సెక్రటరీ రాజకుమార్, డీఆర్వో మోహన్ కుమార్, జిల్లా అధికారులు సత్యనారాయణ, చంద్ర శేఖర్ రెడ్డి, విజయ్ కుమార్, జడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, వరలక్ష్మి, వెంకటరమణ, శ్రీదేవి, చిన్నారెడ్డి, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు ఎమ్మెల్యే ప్రసంగంపై విమర్శలు
జిల్లాలో శాసనసభ అంచనాల కమిటీ సమావేశం నిర్వహణలో స్టేజీ పై కమిటీ సభ్యులతో పాటు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కూర్చుని ప్రసంగించడం విమర్శలకు దారితీసింది. శాసనసభ అంచనాల కమిటీలో నిబంధనల ప్రకారం ప్రభుత్వం సభ్యులను నియమించింది. కమిటీలో ఉన్న సభ్యులు మాత్రమే స్టేజీ పై కూర్చుని సమీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. అయితే చిత్తూరు ఎమ్మెల్యే కమిటీ సభ్యుడు కానప్పటికీ స్టేజీ పై కూర్చుని ప్రసంగించడం ఏమిటని పలు శాఖల అధికారులు గుసగుసలాడారు.
సభ్యుల ప్రసంగం ఇలా...
కమిటీ సభ్యులు పార్థసారథి వాల్మీకి మాట్లాడుతూ.. జిల్లా పరిషత్ నిధులతో కేటాయించిన నిధులలో తాగునీరు, విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ.. అధికారులు సమీక్షకు సంబంధించి అందజేసే నివేదికలను పూర్తి సమాచారంతో ఇవ్వాలన్నారు. వ్యవసాయశాఖకు సంబంధించి నిధులు కేటాయింపులను విభాగాల వారిగా నివేదికను అందజేయాలన్నారు.
వివిధ ప్రభుత్వ శాఖల్లో అమలయ్యే పథకాల కేటాయింపుల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన వివరాల నివేదికలను సమర్పించాలని పాసిం సునీల్ కుమార్ పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాము, కుక్కకాటుకు మందులతో పాటు అవసరమైన ఇతర మందులను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని వరాహ వెంకట సూర్యనారాయణ రాజు కోరారు.
శాసనసభ అంచనాల కమిటీ సమీక్షలో వివిధ శాఖలకు కేటాయించిన నిధులు ఖర్చు చేసిన అంశాలపై గత పదేళ్ల కాల వ్యవధిలో సమీక్షించేందుకు అవకాశం ఉందని ఎమ్మెల్సీ తెలిపారు. ఫొక్సో కేసుల్లోని బాధితులకు వారి పిల్లల సంరక్షణ అంశాలపై ఐసీడీఎస్ అధికారులు నివేదికలు సమర్పించాలని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి పేర్కొన్నారు.

పుంగనూరు అభివృద్ధిని ఓర్వలేకే విమర్శలు

పుంగనూరు అభివృద్ధిని ఓర్వలేకే విమర్శలు