
సారూ.. నదిలో ఇసుక తవ్వకాలు ఆపండి
నగరి : నదిలో ఇసుక తవ్వకాలు ఆపి .. మాపై దయచూపండి అంటూ మండలంలోని తెరణి దళితవాడకు చెందినవారు ఆర్డీఓ కార్యాలయంలో ఏవో, తహసీల్దార్ ధనంజయులుకు వినతిపత్రం అందించారు. కుశస్థలి నదిలో ఇసుక విచ్చలవిడిగా తోడేస్తున్నారని, శ్మశానాన్ని వదలడం లేదని వాపోయారు. పూర్తి స్థాయిలో ఇసుక తోడేయడంతో నదిలో ఇసుక పూర్తిగా అయిపోయి రాళ్లు తేలాయని, డైయింగ్ నీరు నదిలో వదిలేయడంతో అడుగులో పేరుకుపోయిన రసాయన వ్యర్థాలు, ఉప్పు బయటపడుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుకాసురులు ఉచిత ఇసుక పేరుతో ఊడేస్తున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయిదు మండలాలకు చెందిన వందల ట్రాక్టర్లు తెరణి ప్రాంతంలో కుశస్థలి నదిలోనే ఉన్నాయన్నారు. ఇలాగైతే మా మనుగడే ప్రశ్నార్థం అవుతుందని సమస్యను పరిష్కరించాలని అధికారులను దళితవాడ కాలనీ వాసులు కోరారు.

సారూ.. నదిలో ఇసుక తవ్వకాలు ఆపండి