
బోయకొండలో తమ్ముళ్ల తన్నులాట
● టీడీపీ ఇన్చార్జి చల్లాకు స్వాగతం పలకడంలో వర్గపోరు ● టీడీపీ వర్గీయుల పరస్పర దాడులు
చౌడేపల్లె : తెలుగు తమ్ముళ్లు పరస్పరం కొట్టుకొన్న ఘటన బుధవారం బోయకొండ వద్ద చోటు చేసుకుంది. బోయకొండ గంగమ్మ దర్శనం కోసం వచ్చే యాత్రికుల కోసం విజయవాడకు చెందిన దాత సౌమినిరెడ్డి సహకారంతో ఆర్ఓఆర్ ప్లాంటును ఏర్పాటు చేశారు. ఈ ప్లాంటును టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి ప్రారంభోత్సవానికి బోయకొండకు వచ్చారు. టీడీపీ కన్వీనర్ శివప్పనాయుడు, రామకృష్ణ, మల్లికార్జుననాయుడు వర్గీయులు, టీడీపీ మండలాధ్యక్షుడు రమేష్రెడ్డి, బోయకొండ సుబ్బు ఇతర మండల నేతలు కలిసి చల్లాకు స్వాగతం పలికేందుకు ఎవరికి వారు వేర్వేరుగా స్వాగతం పలికి ప్రారంభోత్సవ కార్యక్రమ తంతు ముగించేశారు. కార్యక్రమం పూర్తి అయ్యాక ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి తిరుగు ప్రయాణమై వెళ్లిపోయారు. బోయకొండ –మదనపల్లె మార్గంలోని గల శివప్ప నాయుడు అతని అనుచరులతో కలిసి ఇంటికి కారులో కలిసి వెళ్తుండగా ఇరువర్గాల వారు పరస్పరం దాడులు చేసుకొన్నట్లు తెలిసింది. దీంతో టీడీపీలో వర్గపోరు బట్టబయలైంది.
మాకు న్యాయం చేయండి :
టీడీపీ ప్రభుత్వంలోనే మా పార్టీ నేతల నుంచి మాకు ప్రాణ హాని ఉంది..మాకు న్యాయం చేయండని టీడీపీ కన్వీనర్ శివప్ప నాయుడు, మండల ప్రధాన కార్యదర్శి రామకృష్ణ బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. దౌర్జన్యాలను ప్రశ్నించినందుకే పార్టీ మండల అధ్యక్షుడు రమేష్రెడ్డి ప్రోత్సాహంతోనే బోయకొండ సుబ్బు అతని అనుచరులు, తమపై తమ పార్టీకి చెందిన నాయకులే వచ్చి పక్షిరాజపురం సమీపంలో కారును అడ్డగించి ధ్వంసం చేసి శివప్పనాయుడు, రామకృష్ణ, మల్లికార్జున నాయుడులపై దౌర్జన్యంగా దాడిచేసినట్లు ఆరోపించారు.