
అంబేడ్కర్ అంటే చిన్నచూపెందుకు?
● జిల్లాస్థాయి కార్యక్రమానికి హాజరుకాని ప్రజా ప్రతినిధులు ● దళితులు ప్రశ్నిస్తారనే గైర్హాజరయ్యారేమో? ● తూతూమంత్రంగా అధికారిక అంబేడ్కర్ జయంతి ● విమర్శలు గుప్పిస్తున్న దళితులు, సంఘ నాయకులు
చిత్తూరు కలెక్టరేట్ : ఎంతో ఘనంగా నిర్వహించాల్సిన అంబేడ్కర్ జయంతి అధికారిక వేడుకలకు కూటమి ప్రజాప్రతినిధులు దూరమయ్యారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవనంలో సోమవారం నిర్వహించిన అధికారిక కార్యక్రమానికి కూటమి ఎంపీ, ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. కూటమి ఎంపీ, ఎమ్మెల్యేలు కార్యక్రమానికి హాజరవుతారని ఎదురు చూసిన దళితులు, దళిత సంఘ నాయకులకు నిరాశే మిగిలింది. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్కు కూటమి ప్రజాప్రతినిధులిచ్చే గౌరవం ఇదేనా? అంటూ దళితులు, దళిత సంఘ నాయకులు పెదవి విరిచారు. గత ఐదేళ్లపాటు అంబేడ్కర్ జయంతి అధికారిక కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి సర్కారు జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఈ వేడుకలను తూతూమంత్రంగా నిర్వహించింది. దీనిపై పలువురు పెదవి విరుస్తున్నారు.
దళితులు ప్రశ్నిస్తారనే గైర్హాజరయ్యారా?
కూటమి అధికారంలోకి వచ్చిన గత పది నెలలుగా దళితుల అభ్యున్నతికి చేసిందేమీ లేదు. దళితుల సమస్యలు పరిష్కరించకపోవడంతో దళితులు అందజేసిన వినతులు కుప్పలు కుప్పలుగా పేరుకుపోయాయి. జిల్లాలోని అన్ని దళితుల కాలనీల్లో మౌలిక వసతులు కల్పించని పరిస్థితి. గత ఐదేళ్ల పాటు దళితులకు అందిన సంక్షేమ పథకాలు, కూటమి పాలనలో వారి దరిచేరని దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అంబేడ్కర్ జయంతి వేడుకలకు హాజరైతే ఎక్కడ ప్రశ్నిస్తారేమోనని కూటమి ప్రజాప్రనిధులు గైర్హాజరై, ఉంటారని దళితులు, ఆ సంఘ నాయకులు గుసగుసలాడారు. అంబేడ్కర్ అంటే కూటమి ప్రజాప్రతినిధులకు చిన్నచూపెందుకని? దళిత సంఘ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.
విద్యతోనే గౌరవం సాధ్యం
విద్యతోనే సమాజంలో గౌరవం దక్కుతుందని జాయింట్ కలెక్టర్ విద్యాధరి అన్నారు. సోమ వారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవనంలో అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరైన జేసీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలన్నారు. దళితులు ఆర్థికంగా అభ్యున్నతి చెందాల న్నారు. సమాజంలో గౌరవం సంపాదించాలంటే విద్య ఎంతో ముఖ్యమన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యాభ్యాసానికి అన్ని సౌకర్యాలున్నాయన్నారు. డ్వాక్రా సంఘాల్లో మహిళలు రుణాలు తీసుకుని చిన్నచిన్న వ్యాపారాలతో ఆర్థికాభివృద్ధి సాధించి, సమాజంలో గౌర వంగా జీవించాలన్నారు. ప్రతి ఇంట్లో ఒక వ్యా పార, పారిశ్రామికవేత్త ఉండేలా ఎదగాలన్నారు. ఈ వేడుకల్లో సాంఘిక సంక్షేమ శాఖాధికారి చిన్నయ్య, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, ఎస్సీ, ఎస్టీ సంఘ నాయకులు గోవిందన్, రాష్ట్ర మాల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ యుగంధర్బాబు, డీవీఎంసీ సభ్యులు రాజ్కుమార్, ధనశేఖర్, శంకర్, రవి, దేవరాజులు, మునస్వామి, డేవిడ్, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అంబేడ్కర్ అంటే చిన్నచూపెందుకు?