వేదాంత చూపు చమురు వైపు.. కారణం ఇదే

Why Vedanta Anil Agarwal Focused on Oil Production With Ambani and Adani Investing On Green Energy - Sakshi

దేశంలో బడా పారిశ్రామికవేత్తలు చెరో దిక్కు అన్నట్టుగా పయణిస్తున్నారు. ముఖ్యంగా ఇండియా నంబర్‌ వన్‌ ధనవంతుడి స్థానం కోసం పోటీ పడుతున్న ముకేశ్‌ అంబానీ, గౌతమ్‌ అదానీలు గ్రీన్‌ ఎనర్జీపై ఫోకస్‌ చేస్తుండగా.. వీరికి భిన్నంగా వేదంతా రిసోర్స్‌ అనిల్‌ అగర్వాల్‌ పాతకాలం పద్దతిలో ముడి చమురు ఉత్పత్తిపై దృష్టి పెడుతున్నారు. లాభాలు ఎటుంటే అటే వెళ్లే ఈ బడా బిలియనీర్లు ఎందుకిలా విభిన్న మార్గాలు ఎంచుకున్నారు...

ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన దండయాత్ర అనేక కంపెనీల తలరాతను మార్చేస్తోంది. ఇంతకాలం గ్రీన్‌ ఎనర్జీ మంత్రం జపించిన కంపెనీలు కిమ్మనడం లేదు. మరోవైపు కొత్త కంపెనీలు సోలార్‌, హైడ్రోజన్‌ ఎనర్జీ ఊసెత్తకుండా రెగ్యులర్‌ పంథాలో ముడి చమురు రంగంలో పెట్టుబడులు గుమ్మరిస్తున్నాయి.

4 బిలియన్లు
ఆయిల్‌ రంగంరలో ప్రసిద్ధి చెందిన కెయిర్న్‌కి ఇండియా యూనిట్‌గా ఉన్న వేదాంత కొత్త బిజినెస్‌లైన్‌ తీసుకుంది. ఆయిల్‌ రంగంలో భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. రాబోయే మూడేళ్లలో ఏకంగా నాలుగు బిలియన్‌ డాలర్లను చమురు రంగంలో ఇన్వెస్ట్‌ చేయనుంది. ఈ నిధులతో దేశంలో వేదాంతకి ఉన్న 51 బ్లాకుల్లో భారీగా చమురుతోడే పనులు మొదలెట్టనుంది. 

చాలా టైం ఉంది
ప్రస్తుతం ఏడాదికి వేదాంత 1.50 లక్షల బ్యారెళ్ల ఆయిల్‌ను ఉత్పత్తి చేస్తోంది. అతి త్వరలో ఉత్పత్తి సామర్థ్యాన్ని 5 లక్షల బ్యారెళ్లకు పెంచుకోవాలని వేదాంత డిసైడ్‌ చేసుకుంది. ఈవీ, హైడ్రోజన్‌ వెహికల్స్‌కి సుస్థిరమైన మార్కెట్‌ ఏర్పడేందుకు ఇంకా చాలా సమయం పడుతుందని.. ఈలోగా ఆయిల్‌కి డిమాండ్‌ తగ్గదనే ఆలోచనలో వేదాంత ఉంది. 2050 నాటికి కర్భన ఉద్ఘారాలు జీరో చేయాలని ప్రపంచ దేశాలు చెబుతున్నాయి. ఇంకా దానికి పాతికేళ్లకు మించి సమయం ఉన్నందున ఈలోగా మంచి బిజినెస్‌ చేయోచ్చన్నది వేదాంత ప్లాన్‌.

వార్‌తో మారిన సీన్‌
ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టి దండయాత్రతో ఒక్కసారిగా పెరిగిన ఆయిల్‌ ధరలు ప్రపంచాన్ని ఉలిక్కిపాటుకు గురి చేశాయి. బ్యారెల్‌ చమురు ధర రికార్డు స్థాయిలో 141 డాలర్ల హైని టచ్‌ చేసింది. దీన్ని బట్టి ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్‌కి ఎంత డిమాండ్‌ ఉందో అర్థమవుతోంది. అందుకే వేదాంత యజమాని అనిల్‌ అగర్వాల్‌.. సాటి బిలియనీర్ల బాటను వీడి ఆయిల్‌పై భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు.

అదానీ 20 బిలియన్‌ డాలర్లు
మరోవైపు ఏషియాలోనే బడా బిలియనీర్లుగా రికార్డులెక్కిన అదానీ అంబానీలు పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రానున్న పదేళ్ల కాలంలో 20 బిలియన్‌ డాలర్లు అంటే సుమారు లక్షన్నర కోట్ల రూపాయలను గ్రీన్‌ ఎనర్జీ సెక్టార్‌లో ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ ఇప్పటికే వెల్లడించారు. సోలార్‌, హైడ్రోజన్‌ ఎనర్జీ ఉత్పత్తిపై భారీగా ఖర్చు చేయనుంది అదానీ గ్రూపు. 

గిగా ఫ్యాక్టరీల్లో రిలయన్స్‌
రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ అయితే గ్రీన్‌ ఎనర్జీకి సంబంధించి గిగా ఫ్యాక్టరీలనే ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 450 గిగా వాట్ల గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా గుజరాత్‌లోని జామ్‌ నగర్‌లో భారీ ఫ్యాక్టరీలు నిర్మిస్తున్నారు. ఇక్కడ సోలార్‌, హైడ్రోజన్‌ ఉత్పత్తికి సంబంధించి ప్రత్యేకంగా ఆర్‌ అండ్‌ డీ సెంటర్లు కూడా స్థాపిస్తున్నారు. సోలార్‌, హైడ్రోజన్‌ ఎనర్జీపై దృష్టి పెట్టిన ముఖేష్‌ అంబానీ ప్రపంచ వ్యాప్తంగా ఈ రంగంలో పని చేస్తున్న కంపెనీలతో వరుసబెట్టి ఒప్పందాలు కూడా చేసుకుంటున్నారు. గ్రీన్‌ ఎనర్జీకి ఉన్న భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సౌదీకి చెందిన ఆయిల్‌ కంపనీ ఆరామ్‌కో డీల్‌ విషయంనూ అంబానీ వెనక్కి తగ్గారు ముకేశ్‌ అంబానీ.

చదవండి: ఛార్జీల పిడుగులు.. డీజిల్‌, బంగారం, వంటగ్యాస్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top