
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం 'బుర్జ్ ఖలీఫా' (Burj Khalifa) గురించి దాదాపు అందరూ వినే ఉంటారు. అయితే అంతటి ప్రతిష్టాత్మక భవనాన్ని ఎవరు నిర్మించారు?, దాని ఓనర్ ఎవరు? అనే ఆసక్తికరమైన వివరాలు బహుశా కొంతమందికి తెలిసుండక పోవచ్చు. ఈ కథనం ఆ వివరాలు తెలుసుకుందాం.
ప్రపంచంలో ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా.. అత్యంత ఖరీదైన అపార్ట్మెంట్ భవనాల్లో కూడా ఒకటి. ఇందులో సింగిల్ బెడ్ రూమ్ అద్దె ఏడాదికి 150000 దిర్హామ్స్ నుంచి 180000 దిర్హామ్లు (రూ. 42 లక్షల కంటే ఎక్కువ). దీనిని (బుర్జ్ ఖలీఫా) దుబాయ్లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఎమ్మార్ ప్రాపర్టీస్ నిర్మించింది. ఈ కంపెనీ ఫౌండర్ 'మహమ్మద్ అలబ్బర్' (Mohamed Alabbar). ఈయనే బుర్జ్ ఖలీఫా అసలైన యజమాని.

ఎమ్మార్ ప్రాపర్టీస్ బుర్జ్ ఖలీఫాను మాత్రమే కాకుండా.. దుబాయ్ మాల్, దుబాయ్ క్రీక్ టవర్, దుబాయ్ ఫౌంటెన్ వంటి ఇతర ఐకానిక్ ప్రాజెక్టులను కూడా అభివృద్ధి చేసింది.
బుర్జ్ ఖలీఫా వివరాలు
బుర్జ్ ఖలీఫా ఎత్తు 829.8 మీటర్లు (2,722 అడుగులు). ఇందులో 163 అంతస్తులు ఉన్నాయి. 2004లో ప్రారంభమైన ఈ భవనం నిర్మాణం 2010కి పూర్తయింది. 95 కిలోమీటర్ల నుంచి కూడా కనిపించే ఈ భవనంలో 304 విలాసవంతమైన హోటల్ రూల్స్, 900 హై-ఎండ్ అపార్ట్మెంట్లు ఉన్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ బిల్డింగ్ బయటివైపు శుభ్రం చేయడానికే సుమారు మూడు నెలల సమయం పడుతుందని సమాచారం.