బంగారం ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటేలా పెరిగిపోతున్నాయి. దేశంలో పుత్తడి ధరల పెరుగుదల పసిడిప్రియులను కలవరపెడుతోంది. గడిచిన వారం రోజుల్లో బంగారం ధరలు ఎంత మేర పెరిగాయి.. అందుకు కారణాలేంటి.. అన్న విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం..
దేశంలో బంగారం ధరలు గడిచిన వారం రోజుల్లో భారీగా ఎగిశాయి. 24 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ప్రస్తుత ధర (నవంబర్ 16) రూ.1,25,080. ఇది వారం రోజుల క్రితం అంటే నవంబర్ 9న రూ.1,22,020. అంటే వారం రోజుల్లో రూ.3060 పెరిగిందన్న మాట.
ఇక 22 క్యారెట్ల పసిడి విషయానికి వస్తే.. ప్రస్తుతం (నవంబర్ 16) దీని తులం ధర రూ.1,14,650లుగా ఉంది. ఇది నవంబర్ 9న రూ.1,11,850లుగా ఉండేది. ఒక్క వారంలోనే 10 గ్రాములకు రూ.2800 ఎగిసింది.
ఒక్క వారంలోనే బంగారం ధరలు ఇంతలా పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి.
ఇటీవల బడ్జెట్లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ తగ్గించే అవకాశాలు పెరిగాయి. వడ్డీలు తగ్గితే, బంగారం మరింత ఆకర్షణీయంగా మారుతుంది.
ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, రాజకీయ ఉద్రిక్తతలు బంగారానికి సురక్షిత ఆస్తిగా విలువను కల్పిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు పసిడి కొనుగోళ్లకు మక్కువ చూపుతున్నారు.
కొన్ని దేశాల కేంద్ర బ్యాంకులు తమ బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి. ఇది స్థిరమైన, దీర్ఘకాల డిమాండ్ను పెంచుతుంది.
బంగారానికి సంబంధించిన ఈటీఎఫ్లలో పెట్టుబడులు ఎక్కువవుతున్నాయి. సంస్థాగత పెట్టుబడిదారులు బంగారంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.
యూఎస్ డాలర్ బలం తగ్గడం కూడా బంగారం ధరలకు ఆజ్యం పోస్తోంది. బంగారం విలువ సాధారణంగా డాలర్లలో లెక్కిస్తారు. డాలర్ బలహీనంగా ఉంటే, ఇతర దేశాల పెట్టుబడిదారులు బంగారాన్ని తక్కువ ఖర్చుతో కొనగలరు.


