
పర్మిట్ రెన్యువల్పై కసరత్తు
నవంబర్ నుంచి సేవలు ప్రారంభించే అవకాశం
న్యూఢిల్లీ: దాదాపు మూడేళ్ల క్రితం ఆర్థిక సంక్షోభంతో కార్యకలాపాలు నిలిపివేసిన ట్రూజెట్ (గతంలో టర్బో మేఘా ఎయిర్వేస్) మళ్లీ సర్వీసులను ప్రారంభించడంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త ఇన్వెస్టర్ల దన్నుతో బ్రాండ్ను పునరుద్ధరించేందుకు అనుమతుల కోసం పౌర విమానయాన శాఖను సంప్రదించినట్లు కంపెనీ ఎండీ ఉమేశ్ వంకాయలపాటి తెలిపినట్లు వార్తా కథనం వెలువడింది.
సుదీర్ఘ చర్చల అనంతరం కేంద్రం తమకు నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) జారీ చేసినట్లు ఆయన వివరించారు. ఇక పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ)లో ఎయిర్ ఆపరేటర్స్ పర్మిట్ను (ఏవోపీ) రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుందని ఉమేశ్ తెలిపారు. ఇందుకోసం సుమారు 180 రోజుల వరకుసమయం పట్టొచ్చని ఆయన పేర్కొన్నారు.
ప్రాథమికంగా రూ. 200 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు, 600 మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు ఆయన చెప్పారు. 2015–2022 మధ్య కాలంలో ప్రాంతీయ రూట్లలో చౌక విమానయాన సేవలందించే సంస్థగా, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా ట్రూజెట్ కార్యకలాపాలు సాగించింది. అయితే, కోవిడ్ అనంతర ప్రతికూల ప్రభావాలతో, ఆర్థిక సంక్షోభం తలెత్తి 2022 ఫిబ్రవరి నుంచి కార్యకలాపాలు నిలిపివేసింది.
హబ్గా వైజాగ్..
ఏవోపీ వచ్చాక ఎయిర్బస్ ఏ320 విమానంతో నవంబర్ నుంచి కార్యకలాపాలను పునఃప్రారంభించే యోచనలో ఉన్నట్లు ఉమేశ్ చెప్పారు. వైజాగ్ తమకు హబ్గా ఉంటుందన్నారు. తొలి ఫ్లయిట్ విశాఖ నుంచి ఢిల్లీ, ముంబై, బెంగళూరు లేదా హైదరాబాద్కి నడిపే అవకాశం ఉందని ఉమేశ్ వివరించారు. ఏ320 విమానాలతో పాటు ప్రాంతీయ కనెక్టివిటీ కోసం ఉద్దేశించిన ఉడాన్ స్కీము కింద సర్వీసులు నడిపేందుకు ఏటీఆర్ టర్బోప్రాప్ ఎయిర్క్రాఫ్ట్లను కూడా తీసుకునే ప్రణాళికలు ఉన్నట్లు ఆయన చెప్పారు. ఏటీఆర్లకు లక్నో విమానాశ్రయం బేస్గా ఉంటుందన్నారు.