నేడు ఓపెనింగ్‌ ఓకే- తదుపరి?! 

SGX Nifty indicates Market may open in Positive mode - Sakshi

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 21 పాయింట్లు ప్లస్‌

నిఫ్టీకి 11,591-11,520 వద్ద సపోర్ట్స్‌!

మంగళవారం యూఎస్‌ మార్కెట్లు 1.5 శాతం డౌన్‌

ప్రస్తుతం అటూఇటుగా ఆసియా మార్కెట్లు

పెట్టుబడుల బాటలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు

నేడు(7న) దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.20 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 21 పాయింట్లు పుంజుకుని 11,693 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ 11,672 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. స్టిములస్‌పై చర్చలను నిలిపివేస్తున్నట్లు ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ప్రకటించడంతో మంగళవారం యూఎస్‌ మార్కెట్లు 1.5 శాతం స్థాయిలో క్షీణించాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లు అటూఇటుగా ట్రేడవుతున్నాయి. వరుసగా మూడు రోజులపాటు ర్యాలీ చేసిన నేపథ్యంలో దేశీయంగా నేడు ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యమిచ్చే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఆటుపోట్లు కనిపించవచ్చని అభిప్రాయపడ్డారు.

కొనుగోళ్ల వేవ్‌
వరుసగా మూడో రోజు మంగళవారం దేశీ స్టాక్‌ మార్కెట్లు బుల్‌ దౌడు తీశాయి. సెన్సెక్స్‌ 601 పాయింట్లు దూసుకెళ్లి 39,575 వద్ద ముగిసింది. నిఫ్టీ 159 పాయింట్లు జమ చేసుకుని 11,662 వద్ద స్థిరపడింది. తద్వారా ఇంట్రాడే గరిష్టాలకు సమీపంలోనే మార్కెట్లు నిలిచాయి. 39,624 వద్ద సెన్సెక్స్‌, 11,680 వద్ద నిఫ్టీ ఇంట్రాడే గరిష్టాలకు చేరాయి.

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,591 పాయింట్ల వద్ద, తదుపరి 11,520 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,707 పాయింట్ల వద్ద, ఆపై 11,752 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 22,619 పాయింట్ల వద్ద, తదుపరి 22,384 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 22,991 పాయింట్ల వద్ద, తదుపరి 23,129 స్థాయిలో బ్యాంక్‌ నిఫ్టీకి అవరోధాలు కనిపించవచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,102 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 935 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 237 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా..  డీఐఐలు రూ. 472 కోట్ల అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top