
షేర్ల కొనుగోలు విషయంలో ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించిన బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ సహా మరికొంత మందిపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) చర్యలు చేపట్టింది. సాధనా బ్రాడ్కాస్ట్ షేర్లను కొనుగోలు చేయాలని ఇన్వెస్టర్లకు సిఫారసు చేస్తూ యూట్యూబ్ ఛానళ్లలో తప్పుదోవ పట్టించే వీడియోలకు సంబంధించిన కేసులో అర్షద్ వార్సీ, అతని భార్య మరియా గోరెట్టితో పాటు మరో 57 మంది వ్యక్తులు, సంస్థలను ఏడాది నుంచి ఐదేళ్ల వరకు సెక్యూరిటీస్ మార్కెట్ల నుంచి సెబీ నిషేధించింది.
అర్షద్ వార్సీ, ఆయన భార్య మారియాకు చెరో రూ.5 లక్షల చొప్పున జరిమానా విధించిన సెబీ సాధన బ్రాడ్ కాస్ట్ (ప్రస్తుతం క్రిస్టల్ బిజినెస్ సిస్టమ్ లిమిటెడ్) ప్రమోటర్లతో సహా మరో 57 మంది వ్యక్తులు, సంస్థలపై సెబీ రూ.5 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు జరిమానా విధించింది. అంతేకాకుండా, రూ.58.01 కోట్ల అక్రమ లాభాలను దర్యాప్తు ముగిసినప్పటి నుంచి వాస్తవ చెల్లింపు తేదీ వరకు 12 శాతం వార్షిక వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని సెబీ ఈ సంస్థలను ఆదేశించింది.
ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించడం ద్వారా అర్షద్ వార్సీ రూ.41.70 లక్షలు, ఆయన భార్య మారియా రూ.50.35 లక్షల లాభాన్ని ఆర్జించినట్లు సెబీ పేర్కొంది. ఈ మొత్తం ఆపరేషన్ వెనుక సూత్రధారులు గౌరవ్ గుప్తా, రాకేశ్ కుమార్ గుప్తా, మనీష్ మిశ్రా అని సెబీ తుది ఉత్తర్వుల్లో గుర్తించింది. సాధన బ్రాడ్కాస్ట్ లిమిటెడ్ ఆర్టీఏ డైరెక్టర్గా ఉన్న సుభాష్ అగర్వాల్ మనీష్ మిశ్రా, ప్రమోటర్ల మధ్య జీవోగా వ్యవహరించారని సెబీ ఉత్తర్వుల్లో పేర్కొంది.