
న్యూఢిల్లీ: దేశీ రియల్టీ రంగంలో సంస్థాగత పెట్టుబడులు 2025 జనవరి–మార్చిలో 31 శాతం జంప్ చేసినట్లు రియల్టీ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా పేర్కొంది. ప్రధానంగా రెసిడెన్షియల్ విభాగంలో పెట్టుబడులు పుంజుకోవడంతో 1.3 బిలియన్ డాలర్లను తాకినట్లు ఒక నివేదికలో వెల్లడించింది.
నివేదిక ప్రకారం వీటిలో 60 శాతం వాటాతో దేశీ ఇన్వెస్టర్లు ప్రధాన పాత్ర పోషించారు. వార్షికంగా 75 శాతం వృద్ధితో 0.8 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశారు. పెట్టుబడుల్లో ఇండస్ట్రియల్, వేర్హౌసింగ్, ఆఫీస్ విభాగాలకు ప్రాధాన్యత ఇచ్చారు.
హౌసింగ్ విభాగంలో నిధులు 3 రెట్లు ఎగసి 30.29 కోట్ల డాలర్లకు చేరగా.. గతేడాది ఇదే కాలంలో 10.26 కోట్ల డాలర్లు మాత్రమే లభించాయి. ఆఫీస్ కాంప్లెక్సులలో సంస్థాగత పెట్టుబడులు 23 శాతం క్షీణించి 43.42 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. గత జనవరి–మార్చిలో 56.3 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి.