ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ అహింసా ఇండెక్స్‌! | NSE launched the Nifty500 Ahimsa Index on July 10 | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ అహింసా ఇండెక్స్‌!

Jul 22 2026 4:31 AM | Updated on Jul 22 2026 4:31 AM

NSE launched the Nifty500 Ahimsa Index on July 10

పెట్టుబడుల్లో విప్లవం 

ఎన్‌ఎస్‌ఈ కొత్త 500 ఇండెక్స్‌ ప్రారంభం 

జంతు హింసకు దూరంగా ఉండే కంపెనీలకే చోటు. 

నిఫ్టీ 500 లోని కంపెనీల నుంచి అహింసా ప్రమాణాల ప్రకారం ఎంపిక

భారత స్టాక్‌ మార్కెట్లో థీమ్‌ ఆధారిత పెట్టబడులకు సంబంధించి మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. షేర్‌ మార్కెట్లో పెట్టుబడులు అంటే ఇప్పటివరకు లాభాలు, వృద్ధి, డివిడెండ్లు ప్రమాణాలుగా పరిగణించేవారు. ఇప్పుడు వీటికి ’అహింస’ అనే కొత్త ప్రమాణం కూడా జతకలిసింది.  నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 500 పేరుతో అహింస ఇండెక్స్‌ను ప్రారంభించింది.  జంతువులపై హింసకు పాల్పడని, జంతువులకు సంబంధంలేని కంపెనీలను ఈ ఇండెక్స్‌లో చేర్చడం విశేషం. ఇతరదేశాల్లో కొత్తగా ట్రెండవుతున్న ఎథికల్‌ ఇన్వెస్టింగ్‌ (నైతిక విలువల పెట్టుబడులు)కోరుకునే ఇన్వెస్టర్లకు దేశీయంగా ఈ ఇండెక్స్‌ను ఎన్‌ఎస్‌ఈ అందుబాటులోకి తెచ్చింది.

ఈ ఇండెక్స్‌లో నిఫ్టీ 500 లోని కంపెనీలను ప్రత్యేకంగా పరిశీలించి వాటి ఉత్పత్తులు, వ్యాపార విధానాలు, సేవలు జంతువులకు ఏవిధంగా అయినా హాని కలిగిస్తున్నాయా లేదా అనే అంశాన్ని పరిశీలించి ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియను అహింసాగైన్‌ ఫౌండేషన్‌ రూపొందించిన అహింసా ఇన్వెస్ట్‌మెంట్‌ మూవ్‌మెంట్‌ ఫ్రేమ్‌ వర్క్‌ ఆధారంగా నిర్వహిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు కేవలం లాభాలే కాకుండా పర్యావరణం, సామాజిక బాధ్యత, నైతిక విలువలు వంటి అంశాలను కూడా పెట్టుబడి చేసే ముందు పరిగణలోకి తీసుకుంటున్నారు. పర్యావరణ (ఎని్వరాన్‌మెంటల్‌) సా మాజిక (సోషల్‌), పాలనా (గవర్నెన్స్‌) ఈఎస్‌జీ ప్రమాణాల తర్వాత  యానిమల్‌ వెల్ఫేర్‌ ఇన్వెస్టింగ్‌ కూడా ఇప్పుడు వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. 

భారత మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమలో ఇప్పటికే రూ.80 లక్షల కోట్లకు పైగా ఆస్తులు నిర్వహణలో ఉన్నప్పటికీ జంతు సంక్షేమాన్ని ఆధారంగా చేసుకున్న పెట్టుబడి ఉత్పత్తులు  పరిమితంగానే ఉన్నాయి. ఈ కొత్త ఇండెక్స్‌ ఆ లోటును కొంత వరకు భర్తీ చేయవచ్చనేది మార్కెట్‌ నిపుణుల అంచనా. ఇన్వెస్టింగ్‌ అంటే కేవలం లాభాలే కాదు మన డబ్బు ఏ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తోందో కూడా తెలుసుకోవాల్సిన సమయం వచ్చిందని, విలువలకు ప్రాధాన్యం ఇచ్చే పెట్టుబడుల యుగానికి ఎన్‌ఎస్‌ఈ ఇండెక్స్‌ నాంది పలికిందని భావిస్తున్నారు.    – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

ఎంపిక ఎలా? 
ఇండెక్స్‌లో చేర్చే కంపెనీలను గ్రీన్, ఆరెంజ్, రెడ్‌ అనే మూడు విభాగాలుగా వర్గీకరిస్తారు. 
గ్రీన్‌: జంతు హింసకు దూరంగా ఉండే కంపెనీలు ఆరెంజ్‌: కొంత మేర ప్రభావం చూపే సంస్థలు రెడ్‌: ... జంతువులపై ప్రత్యక్ష ప్రభావం చూపే వ్యాపారాలు ఆరెంజ్, రెడ్‌ కేటగిరీల్లో ఉన్న కంపెనీలను ఈ ఇండెక్స్‌లో చేర్చరు. 
ఈ ఇండెక్స్‌ ఆధారంగా భవిష్యత్తులో ఈటీఎఫ్‌లు, ఇండెక్స్‌ ఫండ్లు, ప్యాసివ్‌ మ్యూచువల్‌ ఫండ్లు, ఇతర పెట్టుబడి ఉత్పత్తులను ప్రారంభించే అవకాశముందని ఎన్‌ఎస్‌ఈ వెల్లడించింది. ప్రస్తుతం ప్రారంభించిన ఇండెక్స్‌ లో బ్యాంకింగ్‌ రంగానికి చెందిన ఒక్క కంపెనీ కూడా లేదు. అలాగే రిలయన్స్‌ గ్రూప్‌ కంపెనీలకు కూడా స్థానం దక్కలేదు. మరోవైపు ప్రముఖ ఐటీ కంపెనీలు,ఆటోమొబైల్, రియల్‌ ఎస్టేట్, కొన్ని తయారీ రంగ సంస్థలు ఇండెక్స్‌లో చోటు సంపాదించాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement