
వడ్డీ రేట్లపై ఆర్బీఐ నిర్ణయం నేడు
ముంబై: కీలక పాలసీ రేట్లపై ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్వహిస్తున్న రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) నేడు (శుక్రవారం) నిర్ణయాన్ని ప్రకటించనుంది. జూన్ 6 ఉదయం 10 గం.లకు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా దీనిపై ప్రకటన చేస్తారని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. బుధవారం ప్రారంభమైన మూడు రోజుల సమీక్ష శుక్రవారం ముగుస్తుంది. ఆర్బీఐ నుంచి ముగ్గురు, ప్రభుత్వం నియమించిన మరో ముగ్గురు మొత్తం ఆరుగురు ఎంపీసీలో సభ్యులుగా ఉన్నారు.
ఆర్బీఐ ఈ ఏడాది ఇప్పటికే ఫిబ్రవరి, ఏప్రిల్లో పావు శాతం చొప్పున రెండు విడతలుగా మొత్తం అర శాతం మేర కీలక పాలసీ రేటును (రెపో) తగ్గించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల వల్ల అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో తాజాగా మూడో విడతలో మరో పావు శాతం తగ్గించవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. ఆర్బీఐ పాలసీ రేటును తగ్గించడంతో చాలా మటుకు బ్యాంకులు కూడా రెపో రేటు ఆధారిత రుణ రేట్లను, మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రేటును ఇప్పటికే కొంత తగ్గించాయి. రెపో రేటు తగ్గితే బ్యాంకులు కూడా రుణాలపై వడ్డీ రేటు తగ్గిస్తాయి. దీంతో రిటైల్, కార్పొరేట్ రుణ గ్రహీతలకు నెలవారీ వాయిదాల (ఈఎంఐ) భారం తగ్గుతుంది.
రియల్టర్ల ఆశలు..
హౌసింగ్కి డిమాండ్ పెంచే దిశగా ఆర్బీఐ రెపో రేటును కనీసం మరో పావు శాతమైనా తగ్గించవచ్చని రియల్టర్ల సమాఖ్యలు క్రెడాయ్, నారెడ్కో ఆశిస్తున్నాయి. గత మూడు నెలలుగా హౌసింగ్ డిమాండ్ నెమ్మదించిన నేపథ్యంలో రేట్లు తగ్గిస్తే అమ్మకాలు మెరుగయ్యేందుకు తోడ్పడుతుందని క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ శేఖర్ పటేల్ తెలిపారు. ఆర్థిక వృద్ధికి, పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకు కూడా సహాయకరంగా ఉంటుందని నారెడ్కో ప్రెసిడెంట్ జి. హరిబాబు చెప్పారు.