
వృద్ధికి మద్దతుగానే రేట్ల తగ్గింపు..
స్పష్టమైన సంకేతం ఇవ్వాలన్నదే ఉద్దేశం
ఆర్బీఐ గవర్నర్ ఎంపీసీ సమావేశం వివరాల వెల్లడి
అంతర్జాతీయంగా ఉద్రిక్తతల నడుమ సెంట్రల్ బ్యాంక్ వృద్ధికి మద్దతుగా నిలుస్తుందన్న స్పష్టమైన సంకేతం ఇవ్వడానికే వడ్డీ రేట్ల కోత నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఆర్బీఐ గవర్నర్ సంయ్ మల్హోత్రా తెలిపారు. లిక్విడిటీ పరంగా స్పష్టతకు, వినియోగం, పెట్టుబడులకు ఊతమిచ్చేందుకు వీలుగా రుణ వ్యయాలను తగ్గించడం ఈ నిర్ణయం వెనుక ఉద్దేశ్యాలుగా పేర్కొన్నారు.
ఆర్బీఐ గవర్నర్ అధ్యక్షతన గల ఆరుగురు సభ్యుల ఎంపీసీ ప్యానెల్ ఈ నెలారంభంలో రెపో, రివర్స్ రెపో రేట్ల కోత నిర్ణయాలు ప్రకటించడం తెలిసిందే. ఈ నెల 4 నుంచి 6 వరకు జరిగిన ఎంపీసీ సమావేశంలో చర్చించి, రికార్డు అయిన వివరాలు (మినిట్స్) విడుదలయ్యాయి. ఐదుగురు సభ్యులు 50 బేసిస్ పాయింట్ల మేర రేట్ల కోతకు అనుకూలంగా ఓటు వేశారు. సౌగత భట్టాచార్య మాత్రం 25 బేసిస్ పాయింట్లకు మొగ్గు చూపించారు.
గత కొన్ని నెలల కాలంలో ద్రవ్యోల్బణం 3 శాతం మేర తగ్గడం (2024 అక్టోబర్లో నమోదైన 6.2 శాతం నుంచి 2025 ఏప్రిల్ నెలలో 3.2 శాతానికి), వార్షికంగా ద్రవ్యోల్బణం 3.7 శాతానికి పరిమితం అవుతుందన్న అంచనాల నేపథ్యంలో 50 బేసిస్ పాయింట్లకు అనుకూలంగా గవర్నర్ మల్హోత్రా మొగ్గు చూపించారు.
ఇదీ చదవండి: ఫైనాన్షియల్ సెక్టార్పై మస్క్ కన్ను
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు అస్థిరమైన రేట్ల కోత కంటే.. 50 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించడం విధానపరమైన స్పష్టతకు, వేగవంతమైన బదిలీకి వీలు కల్పిస్తుందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గుప్తా అభిప్రాయపడ్డారు. తటస్థ విధానానికి సైతం మద్దతు పలికారు.