రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ అధ్వర్వంలోని ఓపెన్ ప్లాట్ల విక్రయాలకు మరోసారి మంచి స్పందన వచ్చింది. నగర శివారు ఓఆర్ఆర్కు సమీపంలోని తొర్రూర్, కుర్మల్ గూడ, బహదూర్ పల్లి ప్రాంతాలలోని 163 ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహించారు.
రెండు రోజుల పాటు జరిగే ఈ బహిరంగ వేలంలో తొలి రోజున తొర్రూరులోని 59 ప్లాట్లకు వేలం నిర్వహించారు. ఈ విక్రయాల్లో అత్యధికంగా చదరపు గజానికి రూ. 39 వేల ధర పలికింది. మొత్తం మీద ఈ ప్రాంతంలో చదరపు గజానికి సగటున రూ. 28,700 ధర పలికింది. ఇక్కడి భూములకు కనీస ధర రూ. 25 వేలుగా నిర్ధారించి వేలం నిర్వహించారు.
సోమవారం నాటి విక్రయాల ద్వారా మొత్తం రూ. 46 కోట్ల మేర ఆదాయం వచ్చిందని స్వగృహ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ తెలిపారు. ఈ వేలం పాటలో 110 మంది బిడ్డర్లు పాల్గొన్నారన్నారు. కాగా తొర్రూర్ ప్రాంతంలోని మిగిలిన 65 ప్లాట్లకు, కుర్మల్ గూడలోని 25 ప్లాట్లు, బహదూర్ పల్లిలోని 13 ప్లాట్లకు మంగళవారం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు.


