జీవితంలో అదృష్టం ఎవర్ని ఎప్పుడు ఎలా వరిస్తుందో చెప్పలేం. రాజస్థాన్లోని కోట్ పుత్లీ పట్టణానికి చెందిన కూరగాయల వ్యాపారి అమిత్ సెహ్రాకు కూడా అదృష్టం అనూహ్యంగా తలుపు తట్టింది. పంజాబ్ స్టేట్ లాటరీ దీపావళి బంపర్ 2025 డ్రాలో రూ .11 కోట్ల బహుమతిని ఆయన గెలుచుకున్నారు.
చిన్న బండిపై కూరగాయలు అమ్ముతూ జీవనం సాగించే అమిత్ సెహ్రా పంజాబ్లోని మోగాకు వెళ్లినప్పుడు భటిండాలో తన స్నేహితుడి దగ్గర రూ .1,000 అప్పుగా తీసుకుని ఒకటి తన పేరు మీద, మరొకటి తన భార్య పేరు మీద రెండు టిక్కెట్లు కొన్నాడు. లాటరీ డ్రాలో తన భార్య పేరు మీద తీసుకున్న టికెట్కు రూ .1,000 దక్కగా మరొకటి విజేతగా నిలిచింది. రూ.500 పెట్టి కొన్న ఆ లక్కీ టికెట్ ఆయన్ను కోటీశ్వరుడిని చేసింది.
అమిత్ సెహ్రా రూ .11 కోట్ల బహుమతిని గెలుపొందినట్లు పంజాబ్ స్టేట్ లాటరీ డిపార్ట్మెంట్ అధికారులు ధృవీకరించారు. ‘అతను బటిండా నుంచి టికెట్ కొనుగోలు చేశాడు. విజేతలు తమ బ్యాంకు, వ్యక్తిగత వివరాలతో పాటు ఒరిజినల్ టికెట్ను పంజాబ్ ప్రభుత్వ కార్యాలయానికి సమర్పించాలి. క్లెయిమ్ సమర్పణకు ఎలాంటి ఫీజు అవసరం లేదు’ అని ఓ అధికారి తెలిపారు.
రూ.11 కోట్లు గెలుపొందిన అమిత సెహ్రా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. లాటరీ ఫార్మాలిటీస్ను పూర్తి చేయడానికి కుటుంబంతో కలిసి బటిండా వెళ్లిన ఆయన తన భావోద్వేగాన్ని మీడియాతో పంచుకున్నారు. ఏఎన్ఐతో మాట్లాడుతూ ‘నా ఆనందాన్ని వ్యక్తం చేయడానికి మాటలు రావడం లేదు. పంజాబ్ ప్రభుత్వానికి, లాటరీ ఏజెన్సీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ రోజు నా కష్టాలు, దుఃఖాలన్నీ మాయమైపోయాయి’ అని పేర్కొన్నారు.
లాటరీ గెలుపుతో ఇక తన పేదరికమంతా పోతుందని చెబుతున్న అమిత్ గెలుపొందిన సొమ్మును ఏం చేయాలనుకుంటున్నాడో కూడా వివరించారు. లాటరీ ద్వారా వచ్చిన డబ్బులో తన స్నేహితుడి ఇద్దరు కుమార్తెలకు తలా రూ.50 లక్షలు ఇవ్వాలనుకుంటున్నానన్నారు. ఇక మిగతా సొమ్మును తన పిల్లల చదువుకు, ఇల్లు కట్టుకోవడానికి ఖర్చు చేస్తానని చెప్పారు.
ఇదీ చదవండి: బంగారం, వెండి, బిట్కాయిన్.. కియోసాకి మరో హెచ్చరిక!
#WATCH | Chandigarh: Amit Sehara from Rajasthan wins Rs 11 Crore in Punjab Lottery Result Diwali Bumper Prize 2025, says, "... I can't express my happiness. I thank the Punjab government and the lottery agency. All my grief and sorrows have vanished today. I have won Rs 11… pic.twitter.com/jHyfWyfLcp
— ANI (@ANI) November 4, 2025


