వాహనాల విక్రయాలు అదుర్స్‌ | PV Dispatches Rise 4 Pc In November SIAM | Sakshi
Sakshi News home page

వాహనాల విక్రయాలు అదుర్స్‌

Dec 14 2024 7:59 AM | Updated on Dec 14 2024 7:59 AM

PV Dispatches Rise 4 Pc In November SIAM

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశవ్యాప్తంగా తయారీ కంపెనీల నుండి డీలర్‌షిప్‌లకు చేరిన ప్యాసింజర్‌ వెహికిల్స్‌ (పీవీ) సంఖ్య గతేడాదితో పోలిస్తే 2024 నవంబర్‌లో 4 శాతం పెరిగి 3,47,522 యూనిట్లకు చేరుకున్నాయి. భారత పీవీ రంగంలో నవంబర్‌ నెలలో ఇవే ఇప్పటి వరకు అత్యధికం.

అక్టోబర్‌లో పండుగ తర్వాత డిమాండ్‌ ఊపందుకుందని సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ (సియామ్‌) తెలిపింది. సియామ్‌ గణాంకాల ప్రకారం.. గత ఏడాది నవంబర్‌లో మొత్తం ప్యాసింజర్‌ వాహనాల హోల్‌సేల్‌ విక్రయాలు 3,33,833 యూనిట్లుగా ఉన్నాయి. మార్కెట్‌ లీడర్‌ మారుతీ సుజుకీ ఇండియా గత నెల హోల్‌సేల్‌ అమ్మకాలు 5 శాతం వృద్ధితో 1,41,312 యూనిట్లను తాకాయి.

హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా నుంచి డీలర్లకు చేరిన వాహనాల సంఖ్య 49,451 నుంచి 48,246 యూనిట్లకు తగ్గాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా అమ్మకాలు 16 శాతం వృద్ధితో 46,222 యూనిట్లకు ఎగశాయి. ద్విచక్ర వాహనాల హోల్‌సేల్స్‌ 2023 నవంబర్‌లో 16,23,399 యూనిట్లు నమోదు కాగా, గత నెలలో 1 శాతం తగ్గి 16,04,749 యూనిట్లకు చేరుకున్నాయి.

స్కూటర్ల విక్రయాలు 12 శాతం పెరిగి 5,68,580 యూనిట్లకు చేరుకున్నాయి. మోటార్‌సైకిల్స్‌ 7.5 శాతం తగ్గి 9,90,246 యూనిట్లకు పడిపోయాయి. గత నెలలో మోపెడ్‌ హోల్‌సేల్స్‌ 6 శాతం పెరిగి 45,923 యూనిట్లు నమోదయ్యాయి. త్రీ–వీలర్స్‌ 1 శాతం క్షీణించి 59,350 యూనిట్లకు వచ్చి చేరాయి. దీపావళి కాని నవంబర్‌లో మొదటిసారిగా టూవీలర్స్‌ హోల్‌సేల్‌ విక్రయాలు 16 లక్షల యూనిట్ల మార్కును 
దాటింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement