పీఈ పెట్టుబడులు 77 శాతం డౌన్‌ | Private Equity Investments Limits To 3.84 Billion Dollars In September | Sakshi
Sakshi News home page

పీఈ పెట్టుబడులు 77 శాతం డౌన్‌

Oct 17 2022 8:24 AM | Updated on Oct 17 2022 8:34 AM

Private Equity Investments Limits To 3.84 Billion Dollars In September - Sakshi

ముంబై: ప్రైవేట్‌ ఈక్విటీ పెట్టుబడులు సెప్టెంబర్‌ త్రైమాసికంలో 3.84 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఏకంగా 77.5 శాతం క్షీణించాయి. సీక్వెన్షియల్‌గా జూన్‌ క్వార్టర్‌తో పోలిస్తే 43.5 శాతం తగ్గాయి. 2021 మూడో త్రైమాసికంలో పీఈ పెట్టుబడులు 17.05 బిలియన్‌ డాలర్లుగా ఉండగా ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 6.80 బిలియన్‌ డాలర్లు వచ్చాయి. లండన్‌ స్టాక్‌ ఎక్సే్చంజ్‌ గ్రూప్‌లో భాగమైన రెఫినిటివ్‌ సమీకరించిన డేటాలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో పీఈ పెట్టుబడులు 33 శాతం క్షీణించి 19.6 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. మరోవైపు, భారత్‌ ఆధారిత పీఈ ఫండ్స్‌ తొలి తొమ్మిది నెలల్లో 8.98 బిలియన్‌ డాలర్లు సమీకరించాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఈ మొత్తం 123 శాతం అధికం. 

తగ్గిన డీల్స్‌.. : డేటా ప్రకారం సెప్టెంబర్‌ త్రైమాసికంలో డీల్స్‌ 14.6 శాతం తగ్గాయి. 478 నుంచి 408కి పడిపోయాయి. అయితే, జూన్‌ త్రైమాసికంలో నమోదైన 356 డీల్స్‌తో పోలిస్తే 14.6 శాతం పెరిగాయి. తొలి తొమ్మది నెలల్లో ఇంటర్నెట్‌ సంబంధ కంపెనీల్లోకి పెట్టుబడులు 52 శాతం తగ్గి 7.47 బిలియన్‌ డాలర్లకు పరిమితం కాగా, కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లోకి 29 శాతం పెట్టుబడులు తగ్గాయి. అటు ఫైనాన్షియల్‌ సర్వీసుల కంపెనీల్లోకి వచ్చే నిధులు 25.7 శాతం, ఇండస్ట్రియల్స్‌లోకి 12.4 శాతం క్షీణించాయి. రవాణా రంగంలోకి మాత్రం 56.8 శాతం, కమ్యూనికేషన్స్‌లో 950 శాతం, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ సంస్థల్లోకి 197 శాతం పెరిగాయి.  

టాప్‌ డీల్స్‌లో కొన్ని.. 
వెర్స్‌ ఇన్నోవేషన్‌ (827.7 మిలియన్‌ డాలర్లు), థింక్‌ అండ్‌ లెర్న్‌ (800 మిలియన్‌ డాలర్లు), బండిల్‌ టెక్నాలజీస్‌ .. భారతి ఎయిర్‌టెల్‌ (చెరి 700 మిలియన్‌ డాలర్లు), టాటా మోటర్స్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ (494.7 మిలియన్‌ డాలర్లు) మొదలైనవి టాప్‌ డీల్స్‌లో ఉన్నాయి.   

చదవండి: ఆ కారు క్రేజ్‌ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్‌.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు!

Advertisement
 
Advertisement
Advertisement