దివాలా తీసిన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఇక పిరమల్‌ గ్రూపే దిక్కా?!

Piramal Group Bidding For Dhfl Acquisition - Sakshi

పిరమల్‌ గ్రూప్‌ చేతికి డీహెచ్‌ఎఫ్‌ఎల్‌! 

ఆఫర్‌కు ఎన్‌సీఎల్‌టీ షరతులతో ఆమోదం

ముంబై: దివాలా తీసిన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కొనుగోలుకు పిరమల్‌ గ్రూప్‌ వేసిన బిడ్డింగ్‌  సోమవారం నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఆమోదం పొందింది. అయితే కొన్ని షరతులకు లోబడి ఈ ఆమోదం ఉంటుందని హెచ్‌పీ చతుర్వేది, రవికుమార్‌ దురైస్వామిలతో కూడిన ట్రిబ్యునల్‌ ముంబై బెంచ్‌ స్పష్టం చేసింది. ఈ అంశానికి సంబంధించి  నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఇచ్చే తుది తీర్పునకు అలాగే డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఒకప్పటి ప్రమోటర్‌ కపిల్‌ వాధ్వాన్‌ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం రూలింగ్‌కు లోబడి తమ రూలింగ్‌ ఉంటుందని ఎన్‌సీఎల్‌టీ డివిజినల్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కొనుగోలు ప్రతిపాదనలకు పిరమల్‌ గ్రూప్‌నకు ఈ ఫిబ్రవరిలో ఆర్‌బీఐ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వగా.. కాంపిటీషన్‌ కమిషన్‌ నుంచి ఏప్రిల్‌లో అనుమతి లభించింది.  

సీఓసీకి సూచన: కాగా ఆమోదిత పరిష్కార ప్రణాళిక (రిజల్యూషన్‌ ప్లాన్‌) కింద  చిన్న స్థాయి స్థిర డిపాజిట్‌ హోల్డర్లకు మరింత డబ్బును ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ రుణదాతల కమిటీ (సీఓసీ)కి ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ తన ఉత్తర్వుల్లో సూచించింది.  రిజల్యూషన్‌ ప్రణాళి కా ప్రతిని తనకు అందించాలన్న కపిల్‌ వాధ్వాన్‌ విజ్ఞప్తిని సైతం ఎన్‌సీఎల్‌టీ తిరస్కరించింది.  

పూర్వాపరాల్లోకి వెళితే... 

వాధ్వాన్ ఇచ్చిన ఆఫర్‌ను పరిశీలించాలని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ రుణ గ్రహీతలకు ఎన్‌సీఎల్‌టీ ఇచ్చిన ఆదేశాలపై మే 25న ఎన్‌సీఎల్‌ఏటీ స్టే ఇచ్చింది. రుణదాతల కమిటీ తరఫున యూనియన్‌ బ్యాంక్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించిన అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ ఈ రూలింగ్ ఇచ్చింది. అయితే సీఓసీల పరిష్కార ప్రణాళికను ఆమోదించడంపై ఎన్‌సీఎల్‌టీ నిర్ణయానికి అడ్డురాబోమని స్పష్టం చేసింది. దీనిపై వాధ్వాన్‌ దాఖలు చేసిన అప్పీల్‌ సుప్రీంకోర్టులో ప్రస్తుతం పెండింగులో ఉంది. వాధ్వాన్‌ గతేడాది స్వయంగా రుణ దాతల కమిటీకి సెటిల్‌మెంట్‌ ఆఫర్‌ ఇచ్చారు. అయితే దీనికి విశ్వసనీయత లేదని సీఓసీ ఈ ఆఫర్‌ను తిరస్కరించింది. బ్యాంకులు, మ్యూచువల్‌ ఫండ్స్‌సహా  కంపెలో పలువురు స్థిర డిపాజిట్‌ హోల్డర్లకు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ దాదాపు రూ.90,000 కోట్లు చెల్లించాల్సి ఉన్న సంగతి తెలిసిందే.  

డీలిస్టింగ్‌కు అవకాశం! 

కాగా  పిరమల్‌ గ్రూప్‌ కొనుగోళ్ల ప్రక్రియ అనంతరం డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ మార్కెట్ల నుంచి డీలిస్టయ్యే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మార్గదర్శకాలు, ఐబీసీ నిబంధనల ప్రకారం పిరమల్‌ గ్రూప్‌ గూటికి చేరిన తర్వాత  డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజీల నుంచి డీలిస్టయ్యే వీలున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వార్తలతో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 10% జంప్‌చేసి రూ. 20.80 వద్ద ముగిసింది.

చ‌ద‌వండి : బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top