చెల్లింపులు లేకుండా ‘గూగుల్‌’ వార్తలు!! న్యూస్‌ ఏజెన్సీల ఫిర్యాదుతో దర్యాప్తు

News Aggregation Dominance CCI orders probe against Google - Sakshi

టెక్‌ దిగ్గజం గూగుల్‌కు భారత్‌లో మరో ఝలక్‌ తగిలింది. చెల్లింపులు లేకుండా గూగుల్‌ సెర్చ్‌ ఫలితాల్లో వార్తలను ప్రచురించడంపై వార్తా సంస్థల అభ్యంతరాలను  కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు గూగుల్‌కి వ్యతిరేకంగా వార్త ప్రచురణ సంస్థలు చేస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేపట్టనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. 

ఆండ్రాయిడ్‌ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించడంతో పాటు థర్డ్‌ పార్టీగా ఉంటూ యాప్‌ డెవలపర్స్‌ను కమిషన్‌ పేరుతో ఇబ్బంది పెడుతోందన్న ఆరోపణలపై గూగుల్‌పై ఇదివరకే సీసీఐ దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే యాంటీ ట్రస్ట్‌ చట్టాల్ని గూగుల్‌ ఉల్లంఘిస్తోందంటూ డిజిటల్‌ న్యూస్‌ పబ్లిషర్స్‌ అసోషియేషన్‌(డీఎన్‌పీఏ) తాజాగా సీసీఐని ఆశ్రయించాయి. దేశంలో కొన్ని మీడియా కంపెనీలకు సంబంధించిన డిజిటల్‌ విభాగాల్లో ఒకటైన డీఎన్‌పీఏ.. తమ సభ్యులకు ప్రకటనల ఆదాయాన్ని పారదర్శకంగా చెల్లించేందుకు గూగుల్‌ విముఖత వ్యక్తం చేసిందని ఫిర్యాదులో పేర్కొంది. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టింది సీసీఐ. 

దేశంలోని నిర్దిష్ట ఆన్‌లైన్ సెర్చ్‌ సేవలపై Google ఆధిపత్యం చెలాయిస్తోందని, వార్తా ప్రచురణకర్తలపై అన్యాయమైన షరతులు విధిస్తోందని పేర్కొంటూ దర్యాప్తునకు ఆదేశించింది సీసీఐ. ప్రజాస్వామ్యంలో కీలకంగా వ్యవహరిస్తున్న న్యూస్‌ మీడియాను అణగదొక్కడమే అవుతుందని కీలక వ్యాఖ్యలు చేస్తూ దర్యాప్తునకు ఆదేశించింది సీసీఐ.

ఇదిలా ఉంటే Google వంటి ఆన్‌లైన్ అగ్రిగేటర్‌లకు ప్రకటనల ఆదాయాన్ని కోల్పోతున్నాయి వార్తా సంస్థలు.  టెక్ కంపెనీలు తమ సెర్చ్ ఫలితాలలో కథనాలను, చెల్లింపు లేకుండా ఇతర ఫీచర్‌లను ఉపయోగిస్తాయంటూ కొన్నేళ్లుగా వార్త సంస్థలు గళం వినిపిస్తున్నా ఇన్నాళ్లూ ప్రయోజనం లేకుండా పోయింది. ఒక్క భారత్‌లోనే కాదు.. మరికొన్ని దేశాల్లో సైతం ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొంటుండగా.. భారీ భారీ జరిమానాలు విధిస్తున్నాయి ఆయా దేశాల విచారణ సంస్థలు. ఈ నేపథ్యంలో భారత్‌లో తాజాగా ఎదురైన పరిణామం గూగుల్‌ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టినట్లయ్యింది.

సంబంధిత వార్త:  గూగుల్‌న్యూస్‌.. గూగుల్‌కు ఫ్రాన్స్‌ రూ.4,415 కోట్ల ఫైన్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top