ఫండ్స్‌ పరిశ్రమలో మహిళలకు మరింత చోటు | Morning Star Report Says Fund Manager Trend Increased | Sakshi
Sakshi News home page

ఫండ్స్‌ పరిశ్రమలో మహిళలకు మరింత చోటు

Mar 5 2022 8:57 AM | Updated on Mar 5 2022 9:01 AM

Morning Star Report Says Fund Manager Trend Increased - Sakshi

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమలో మహిళా ఫండ్‌ మేనేజర్ల ప్రాతినిధ్యం కొంత పెరిగింది. మొత్తం 399 మంది ఫండ్‌ మేనేజర్లలో మహిళలు 32 మంది ఉన్నారు. 2021లో వీరి సంఖ్య 30గానే ఉంది. అంటే మొత్తం ఫండ్‌ మేనేజర్లలో మహిళలు 8 శాతమే ఉన్నట్టు తెలుస్తోంది. మార్నింగ్‌ స్టార్‌ సంస్థ ఇందుకు సంబంధించిన వివరాలతో ఒక నివేదికను విడుదల చేసింది.

మొత్తం ఫండ్‌ మేనేజర్ల సంఖ్య 2021లో 376గానే ఉంటే, తాజాగా 399కు పెరగడం గమనార్హం. మహిళా ఫండ్‌ మేనేజర్లు రూ.4.55 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల ఆస్తులను (ఏయూఎం) నిర్వహిస్తున్నారు. మొత్తం మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ ఏయూఎం రూ.38 లక్షల కోట్లలో మహిళా ఫండ్‌ మేనేజర్లు నిర్వహిస్తున్న ఆస్తుల పరిమాణం 12 శాతంగా ఉంది. గతేడాది ఇది 13.5 శాతంగా ఉండడం గమనించాలి. 

45 సంస్థలతో కూడిన మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమలో మహిళా ఫండ్‌ మేనేజర్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2017లో మార్నింగ్‌ స్టార్‌ మొదటిసారి నివేదిక విడుదల చేసే నాటికి మహిళా ఫండ్‌ మేనేజర్లు 18 మంది ఉన్నారు. 2018 నాటికి 24కు, 2019లో 29కు, 2020 నాటికి 28కి, 2021లో 30కి వీరి సంఖ్య పెరుగుతూ వచ్చింది.  

చాలా తక్కువ..  
‘‘కేవలం 8 శాతం అంటే మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమలో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువ ఉన్నట్టు. గడిచిన రెండేళ్లలో మహిళా ఫండ్‌ మేనేజర్ల శాతంలో పురోగతి ఉంది’’ అని మారి్నంగ్‌స్టార్‌ నివేదిక తెలిపింది. ఇక 19 మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల పరిధిలో 32 మంది మహిళా ఫండ్‌ మేనేజర్లు పనిచేస్తున్నారు. నాలుగు ఫండ్‌ సంస్థల్లో ముగ్గురు అంతకంటే ఎక్కువే పనిచేస్తుంటే, నాలుగు ఫండ్‌ హౌస్‌లలో కనీసం ఇద్దరు చొప్పున ఉన్నారు. ఇక 11 ఫండ్స్‌ సంస్థల్లో కనీసం ఒక మహిళా ఫండ్‌ మేనేజర్‌ పనిచేస్తున్నారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement